Gold Price
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు గుడ్ న్యూస్. ఐదు రోజులుగా పసిడి ధరలు(Gold Price) కొద్దికొద్దిగా తగ్గుతూ సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. నిజానికి ఇరాన్ , ఇజ్రాయెల్, అమెరిక మధ్య యుద్ధం వల్ల పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతాయని.. ఏకంగా తులం రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
యుద్ధ వాతావరణం వల్ల స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలడంతో పెట్టుబడిదారులంతా బంగారం వైపు మొగ్గు చూపిస్తారని..దాని వల్ల ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ చిత్రంగా మార్కెట్ నిపుణుల అంచనాలను కూడా తలకిందులు చేస్తూ పసిడి ధరలు(Gold Price) నేలచూపులు చూస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి పుత్తడి ధర తులంపై సుమారు 770 రూపాయలు తగ్గింది. నిన్నటి వరకు లక్షా 62 వేల 880 రూపాయల వద్ద ఉన్న రేటు, ఈరోజు ఒక లక్షా 62 వేల 110 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర లక్షా 48 వేల 600 రూపాయల వద్ద కొనసాగుతోంది.
విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం లక్షా 62 వేల 260 రూపాయల వద్ద స్థిరపడింది.
బంగారంతో పాటే వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్లో కిలో సిల్వర్ ధర ప్రస్తుతం 2 లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద ఉండగా, ఢిల్లీలో ఇది 2 లక్షల 85 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. గంటల వ్యవధిలోనే బంగారం,వెండి రేట్లు ఇలా దిగిరావడంతో నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కలిసి రావడంతో జ్యువెలరీ షాపులు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి.
యుద్ధం వల్ల బంగారం ధరలు పెరుగుతాయన్న భయంతో ఉన్నవారికి.. ఈ తగ్గుదల పెద్ద ఊరటనిచ్చింది. ఈ ట్రెండ్ ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
