Energy Drink
సమ్మర్ వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత, చెమట వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాడీ నుంచి విపరీతమైన చెమట బయటకు వచ్చినప్పుడు కేవలం నీరు మాత్రమే కాకుండా సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు కూడా బయటకు వెళ్లిపోతుంటాయి.
దీనివల్ల శరీరం తన పట్టును కోల్పోయి విపరీతమైన నీరసం, తల తిరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి సమయంలో శరీరంలోని నీటి శాతాన్ని కాపాడుకోవడానికి , డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఉప్పు, చక్కెర కలిపిన నీటి ద్రావణం ఒక గొప్ప సంజీవనిలా పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
మన శరీరంలోని కణాలు, నరాలు , గుండె సరిగ్గా పనిచేయడానికి ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ద్రావణంలోని ఉప్పు మన రక్తపోటును కంట్రోల్ చేయడమే కాకుండా శరీరంలో ద్రవాలు నిలిచి ఉండేలా చేస్తుంది. మరోవైపు చక్కెర రక్తంలో త్వరగా కలిసి మెదడుకు, శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ అందిస్తుంది.
దీనివల్ల ఎండలో ప్రయాణించేటప్పుడు కలిగే అలసట తగ్గి, స్పృహ కోల్పోయే ప్రమాదం తప్పుతుంది. ముఖ్యంగా ఎక్కువగా వేడి వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నప్పుడు ఈ ద్రావణాన్ని తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్లోకి వస్తుంది.
ఈ ఎనర్జీ డ్రింక్ (Energy Drink ) మరింత శక్తివంతంగా మార్చుకోవడానికి దీనిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే విటమిన్ సి కూడా అందుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నీరసాన్ని త్వరగా తగ్గిస్తుంది. సమ్మర్లో కేవలం దాహం వేసినప్పుడే కాకుండా మధ్యమధ్యలో.. ఈ ఎనర్జీ డ్రింక్ తాగుతూ ఉండటం వల్ల వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అయితే షుగర్ , బీపీ వంటి సమస్యలు ఉన్నవారు మాత్రం వీటి పరిమాణం విషయంలో డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. బయట దొరికే కెమికల్స్,ఫెస్టిసైడ్స్తో కూడిన శీతల పానీయాలు తాగడం కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే సహజ సిద్ధమైన ఎనర్జీ డ్రింక్(Energy Drink) తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
