America
అంతర్జాతీయ రాజకీయాలలో మరోసారి వేడి పెరిగింది. ఇరాన్ను ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీయడానికి అమెరికా గట్టి ప్లాన్ వేసింది. ఇరాన్తో చేతులు కలిపే ఇతర దేశాలకు, ఆ దేశంలో వ్యాపారాలు చేసే కంపెనీలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్తో ఏ రకమైన వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నా కూడా యూఎస్ ఆంక్షల నుంచి తప్పించుకోవడం కష్టమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఇరాన్ నుంచి ఎక్కువగా ఇంధనం కొంటున్న చైనాను టార్గెట్ చేస్తూనే..ఇప్పుడు అమెరికా ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. చైనా బ్యాంకులు, కంపెనీలపై ఆంక్షలు ఉంటాయా అని డైరెక్టుగా చెప్పకపోయినా కూడా ఈ రూల్స్ నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని తేల్చి చెప్పేశారు.
ఇరాన్ ఇంధనం అమ్మి..అలా వచ్చిన డబ్బును దేశంలో అణచివేతతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతోందని అమెరికా ఆరోపించింది. అందుకే ఆ ఫండింగ్ను కట్ చేయడమే తమ మెయిన్ ఎయిమ్ అని తాజాగా ప్రకటించింది.
దీనికోసం యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏకంగా ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ అనే ప్రత్యేకమైన క్యాంపెయిన్ను స్టార్ట్ చేసింది. ఇరాన్ ఆయిల్ అక్రమ రవాణా నెట్వర్క్లను, ఆంక్షల నుంచి తప్పించుకునే దారులను యూఎస్ ఇప్పటికే ట్రాక్ చేసింది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు ఒక్క పైసా కూడా అందకుండా బ్లాక్ చేస్తామని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అంతేకాదు, ఇరాన్ సైనికులు కూడా దీనిపై ఆలోచించుకోవాలని, తమ నాయకులు దేశాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తున్నారా లేక నాశనం చేస్తున్నారా అని ప్రశ్నించుకోవాలని స్కాట్ బెస్సెంట్ హాట్ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఇరాన్ ఎగుమతి చేసే చమురులో సుమారు 90 శాతం చైనానే కొంటోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇంకా నిలబడి ఉంది అంటే దానికి చైనానే ప్రధాన కారణం. ఇలాంటి టైమ్లో అమెరికా నుంచి ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా సెప్టెంబర్ 24న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లి యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ కీలక భేటీకి కొద్దిరోజుల ముందే ఈ పరిణామాలు జరగడం ప్రపంచవ్యాప్తంగా కుతూహలాన్ని రేపుతోంది.దీనిపై చైనా ఎలా రియాక్టవుతుందనే చర్చ అంతర్జాతీయంగా మొదలయింది.
మరోవైపు అమెరికా బెదిరింపులపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబఫ్ దీనిపై రియాక్టవుతూ.. అమెరికా బెదిరింపులను తామెవరూ పట్టించుకోమని ఎద్దేవా చేశారు. ఇతర దేశాల సంబంధాలపై ఆంక్షలు విధించే అధికారంలో ప్రస్తుతం అమెరికా లేదంటూనే.. తమ వాణిజ్య భాగస్వాములు ఇలాంటి బెదిరింపులను అస్సలు కేర్ చేయరని తేల్చి చెప్పారు.
