Hormuz
ప్రపంచదేశాల ఇంధన అవసరాలను తీర్చే పశ్చిమాసియా ప్రాంతం.. ఇప్పుడు మరోసారి రణరంగంగా మారుతోంది. తాజాగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా ముగియడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
చర్చల వైఫల్యం కావడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. దీంతో ప్రత్యక్ష ప్రభావం చమురు మార్కెట్పై పడినట్లు అయింది. ఒక్క రాత్రిలోనే ముడి చమురు ధరలు దాదాపు 11 శాతం పెరిగి, బ్యారెల్ ధర 105 డాలర్ల మార్కును తాకడం భవిష్యత్తులో రాబోయే సంక్షోభానికి సంకేతంగా కనిపిస్తోంది.
అమెరికాకు చెందిన డబ్ల్యూటీఐ క్రూడ్, బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా భారీగానే పైకి ఎగబాకాయి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ధరలు ఒకటే కాదు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ (Hormuz) జలసంధి ఇప్పుడు మెయిన్ సమస్య అయింది.
అమెరికా నౌకాదళం సోమవారం రాత్రి నుంచి ఈ హర్మూజ్ (Hormuz) జలసంధిని దిగ్బంధం చేయాలని నిర్ణయించడంతో, ఇరాన్ నుంచి ఆసియా దేశాలకు వచ్చే గ్యాస్, చమురు సరఫరాలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ పరిణామం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెద్ద సవాలుగా మారనుంది.
ముఖ్యంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల లీటర్ పెట్రోల్పై రూ. 20, డీజిల్పై రూ. 15 వరకు పెరిగే వీలుంటుంది.
కేవలం వాహనాల ఇంధనమే కాకుండా వంట గ్యాస్ (LPG) , సీఎన్జీ ధరలపైన కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దేశంలో ప్రస్తుతం ఉన్న నిల్వలు కేవలం 20 రోజులకు మాత్రమే సరిపోతాయని నిపుణుల హెచ్చరిస్తుండటంతో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు తప్పనిసరిగా ఏర్పడింది.
ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఇంధన కొరతను తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.
పెట్రోల్, గ్యాస్కు బదులు కరెంట్ (Electric Energy) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అయితే వచ్చే మూడు వారాలు అత్యంత కీలకమని, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే మాత్రం ఇంధన భారం.. సామాన్యుడిపై మరింత భారాన్ని మోపే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంధన పొదుపుతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగమే అందరి ముందున్న ఏకైక మార్గం అనుకుని దానిపైన ఫోకస్ చేయాలి.
HCA : హెచ్ సీఎకు త్వరలో మంచిరోజులు…కొత్త సెక్రటరీ జీవన్ రెడ్డి
