Pawan Kalyan
ఏపీ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా కూడా, క్షేత్రస్థాయిలో ప్రతిపక్షం నుంచి ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టడంలో మాత్రం ఒక రకమైన స్తబ్దత కనిపిస్తూ ఉండటం ఆశ్చర్చపరుస్తుంది. అయితే అవి ప్రజల నుంచి వినిపిస్తే ఓకే కానీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కూడా పదే పదే ఇదే చెప్పడం ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది.
తాజాగా జనసేన జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు ఏకంగా మీటంగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.తిరుమల లడ్డూ ప్రసాదం వంటి అత్యంత సున్నితమైన అంశంపై ఇటీవల వైసీపీ ఎదురుదాడి చేస్తున్నా, తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మౌనంగా ఉండటాన్ని పవన్ తప్పుబట్టారు. అన్నింటికీ నేనే మాట్లాడాలా అని ఫైరయ్యారు. అయితే పవన్ ఇలా తమ కేడర్ను ప్రశ్నించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నారు.
ఒక పార్టీ అధినేతగా ఆయన తన కేడర్ను, ప్రజాప్రతినిధులను ఇకపైన అయినా సమరశంఖం పూరించమని పవన్ క్లాస్ పీకారు. వైసీపీ నేతలు ట్రాప్ సెట్ చేస్తారని, వ్యక్తిగత విమర్శలకు భయపడి వెనకడుగు వేయొద్దని నేతల్లో ధైర్యాన్ని కూడా నింపారు. చివరకు అందరి చిట్టా తన దగ్గర ఉందని పవన్ హెచ్చరించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే దీనితో పనితీరు మెరుగుపరుచుకోని నేతలకు భవిష్యత్తులో చోటు ఉండదనే ఇన్ డైరెక్ట్ హింట్ కూడా ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీని ఘోరంగా ఊడ్చేసిన కూటమి నేతలు..తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిలవుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఒక విషయం గురించి కూడా చెప్పుకోవాలి. నిజానికి వైసీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి పవన్ మేనియా ఎంత ఉపయోగపడిందో వైసీపీ నేతలపై జనాలకు అంత వ్యతిరేకత రావడం కూడా కారణమే. అందుకే టీడీపీ నుంచి , జనసేన నుంచి , బీజేపీ నుంచి అంతగా జనాలకు పరిచయం లేని నేతలు కూడా ఈసారి ఎన్నికలలో నిలబడి విజయాన్ని సాధించారు.
అయితే మొన్నటి తిరుమల కల్తీ నెయ్యి విషయం కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం వర్సస్ వైసీపీ నేతల విషయం కావొచ్చు..ఇలా ప్రతీ విషయం వెనుక కూటమి నేతల మౌనానికి మాత్రం ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
చాలా మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు అధికారంలోకి రావడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకే వీరిలో చాలామందికి ఒక ఇష్యూ మీద లోతైన అవగాహన ఉండటం లేదు. వైసీపీ నేతలు సీనియారిటితో రెచ్చగొట్టే ప్రశ్నలు వేసినప్పుడు, వాటిని డేటాతో సహా తిప్పికొట్టేంత హోమ్ వర్క్ వీరు చేయడం లేదు. దీంతో మీడియా ముందు అభాసుపాలు కావడం కంటే మౌనంగా ఉండటమే బెటరని సైలెంట్ అయిపోతున్నారు.
అలాగే వైసీపీ వ్యక్తిగత దాడితో ట్రాప్ చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఏదైనా విషయాన్ని వ్యక్తిగత దూషణల వైపే మళ్లిస్తుంది. అరవ శ్రీధర్ కేసులో జరిగినట్టే, ఏదైనా చిన్న తప్పు దొరికినా కూడా దాన్ని భూతద్దంలో చూపి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ఈ భయం వల్ల చాలా మంది నేతలు మనకెందుకు వచ్చిన గొడవ అని వెనక్కి తగ్గుతున్నారు.
మరి కొంతమంది నేతలు పాత అలవాట్లను వదులుకోవడం లేదు. రేపు రాజకీయ పరిస్థితులు మారితే వైసీపీతో ఇబ్బంది కలగకూడదనో, లేదా అనవసరంగా శత్రువులను పెంచుకోవడం ఎందుకనో సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు.
అందుకే వివాదం కానీ ముఖ్యమయిన విషయం కానీ మాట్లాడాల్సి వస్తే.. టాప్ లీడర్స్ అయిన కొంతమంది మీడియా ముందుకు వస్తున్నారు తప్ప మిగిలిన నేతలు మాత్ర గొంతు విప్పడం లేదు. ఈ ప్యాటర్న్ వల్ల.. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే నేతలు మాట్లాడటం లేదని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు దాన్ని డెఫెండ్ చేయలేకపోవడం వల్ల ..వైసీపీ బాధితుడి కార్డు ప్లే చేస్తోంది.
రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. అధికారం రాగానే నేతల్లో రిలాక్స్ మోడ్ వచ్చేసింది. కానీ ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పార్టీ వాయిస్ కావాలన్న విషయాన్ని మరిచిపోతున్నారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan )చెప్పినట్లుగా, వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి, సబ్జెక్ట్ మీద, సిద్ధాంతం మీద ప్రతీ ఒక్కనేత కూడా వైసీపీని ఢీకొట్టాలి. కూటమి నేతలు తమ గొంతు విప్పకపోతే, ఆ ఖాళీని ప్రతిపక్షం తమ అబద్ధాలతో నింపేస్తుంది. పవన్ కోపంలోని నిజం కూడా ఇదే. మరి పవన్ వేకప్ కాల్తోనైనా నేతలు మౌనం వీడతారో లేదో చూడాలి.
Superstitions:తుమ్మితే కూర్చుని వెళ్లాలా? రాత్రి ఎందుకు ఇళ్లు ఊడ్చకూడదు? ఇవి నిజంగా మూఢ నమ్మకాలేనా?
