Ambulance
ఏపీలోని పాడి రైతులకు భరోసా కల్పించడానికి కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన అడుగు వేసింది. పాడి పశువుల ఆరోగ్యంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది రైతన్నలకు మేలు చేసేలా .. రాష్ట్రవ్యాప్తంగా పశు వైద్య అంబులెన్స్(Ambulance) సేవలను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా పశువులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వాటిని కిలోమీటర్ల దూరంలో ఉండే పశువుల హాస్పిటల్కు తీసుకుని వెళ్లడం రైతులకు పెద్ద భారంగా మారేది.
దీని వల్ల రైతుల సమయం వృధా అవ్వడమే కాకుండా, రవాణా ఖర్చు కూడా తడిసి మోపెడయ్యేది. ఈ కష్టాలను తీరుస్తూ, మనుషులకు 104 సేవలు అందిస్తున్నట్లుగానే.. పశువుల కోసం 300 ప్రత్యేక అంబులెన్స్లను (Ambulance)ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు అచ్చెన్నాయుడు ప్రారంభించారు.
ఈ కొత్త విధానం ప్రకారం,ప్రతి అంబులెన్స్ (Ambulance) రోజుకో గ్రామంలో సేవలు అందిస్తూ ఉంటుంది. పశు వైద్యశాలలు అందుబాటులో లేని మారుమూల గ్రామాలకు కూడా 20 రోజులకు ఒకసారి ఈ అంబులెన్స్లు చేరుకుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ గ్రామంలోనే ఉండి పశువులకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తారు.
ఈ అంబులెన్స్లో అత్యాధునిక వైద్య పరికరాలు , మందులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల రైతులకు చికిత్స కోసం పక్క ఊరికి, సిటీలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఈ అంబులెన్స్ సేవలతో పాటు జనవరి 31 వరకు ఏపీ వ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలను కూడా నిర్వహించనున్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
అంతేకాకుండా వైద్య సేవలతో పాటు ఆర్థిక భద్రత కోసం పశువులకు మూడేళ్ల పాటు ఇన్సూరెన్స్ (బీమా) సౌకర్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది. అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన రూ. 150 కోట్ల బీమా బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసి రైతులకు అండగా నిలిచింది. అంతేకాకుండా, పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై పశుగ్రాసాన్ని (దాణా) అందించే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు వేగవంతం చేశారు.
గతంలో ఫోన్ చేస్తే వచ్చే అంబులెన్స్ విధానం సరిగ్గా అమలు కాలేదు. దీంతో ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఊరూరా తిరిగే పద్ధతిని ప్రవేశపెట్టారు. పాడి రైతుల ఆదాయం పెరగాలంటే పశువుల ఆరోగ్యమే ఇంకా ముఖ్యమని భావించిన ప్రభుత్వం, ఈ దిశగా చేపట్టిన ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
