Gold prices :శుభ ముహూర్తాల వేళ గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold prices : అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులతో పాటు అమెరికా ఆర్థిక విధానాల్లో చోటు చేసుకున్న పరిణామాలు దీనికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

Gold prices

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి శుభకార్యాల సందడి మొదలుకానుంది. రేపటి నుంచి వరుసగా రెండు నెలల పాటు శుభముహూర్తాలు ఉండటంతో పసిడి కొనేవారంతా వాటి ధరలపై ఆరా తీస్తున్నారు. మామూలుగా పెళ్లిళ్ల సీజన్ మొదలైతే డిమాండ్ పెరగడంతో.. బంగారం ధరలు(Gold prices) ఆకాశాన్ని తాకుతాయి, కానీ ఈసారి మాత్రం పుత్తడి ప్రియులకు మార్కెట్ తీపి కబురే అందించింది.

కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold prices) ఈ రోజు మరోసారి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులతో పాటు అమెరికా ఆర్థిక విధానాల్లో చోటు చేసుకున్న పరిణామాలు దీనికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడం వల్ల ఈ నిర్ణయం పసిడి మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్ కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాలతో డాలర్ విలువ పెరగడంతో..బంగారంపై పెట్టుబడులు తగ్గిపోయాయి. ఈ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ఏకంగా 110 డాలర్లు తగ్గి 4,884 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే తులం బంగారంపై సుమారు రూ.3,500 వరకు తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరట.

Gold prices

తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,190 వద్ద కొనసాగుతుండగా.. జ్యువెలరీ తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,340 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే, పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంది. కిలో వెండిపై గడిచిన రెండు రోజుల్లో దాదాపు రూ.15,000 వరకు తగ్గి, ప్రస్తుతం రూ.2,64,900 వద్ద విక్రయించబడుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.1,41,490 ఉండగా, ముంబై , బెంగళూరు నగరాల్లో హైదరాబాద్‌లో కూడా ఇవే ధరలే ఉన్నాయి. శుక్ర మౌఢ్యం ముగిసి ఫిబ్రవరి 19 నుంచి పెళ్లిళ్ల సందడి ప్రారంభం కానుండటంతో, ఈ ధరల తగ్గింపు కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారనుంది. అయితే అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాల బట్టి ఈ ధరలు మారే అవకాశం ఉంటుందని.. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసిడి ధరలు కాస్త శాంతించడంతో.. శుభకార్యాల కోసం గోల్డ్ కొనేవారికి నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version