Ghost Towns:రాత్రికి రాత్రే మాయం అయిన ఊళ్లు.. గోస్ట్ టౌన్స్ మిస్టరీ

Ghost Towns: 1964లో వచ్చిన భీకరమైన తుపాను ఈ ధనుష్కోడి పట్టణాన్ని నాశనం చేసేసింది. ఇళ్లతో పాటు రైలు పట్టాలు, చర్చిలు, రైల్వే స్టేషన్, అన్నీ కూడా సముద్రపు అలల ధాటికి కొట్టుకుపోయాయి.

Ghost Towns

ఒకప్పుడు వేలాదిమంది జనాలతో, పిల్లాపాపల కేరింతలతో కళకళలాడిన ఊళ్లు, రాత్రికి రాత్రే శ్మశానంలా మారిపోవడం వంటివి సినిమాలలో మాత్రమే చాలా మంది చూస్తారు. కానీ వినడానికి భయంకరంగా, ఆశ్చర్యంగా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా గోస్ట్ టౌన్స్( Ghost Towns) పేరుతో ఇలాంటి నిర్మానుష్యమైన నగరాలు ఎన్నో నిజంగానే ఉన్నాయి.

ఇలా జరగడం వెనుక కొన్నిచోట్ల యుద్ధాలు కారణం అయితే, మరికొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. అలాగే ఇంకొన్ని చోట్ల అయితే అంతుచిక్కని మిస్టరీలుగా నేటికీ అలాగే ఉన్నాయి. మన దేశంలో రాజస్థాన్‌కు చెందిన కుల్ధరా అనే ఊరు దీనికి ఒక సజీవ సాక్ష్యం.

13వ శతాబ్దం నుంచి ఎంతో వైభవంగా వెలిగిన ఈ కుల్ధరా, 19వ శతాబ్దంలో రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అప్పటి పాలకుల అరాచకాలు భరించలేక ఈ ఊరివారంతా వెళ్లిపోయారని .. వెళ్తూ వెళ్తూ ఊరిని శపించి వెళ్లారని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ ఊరిలో ఏ ఒక్కరూ రాత్రి వేళ ఏ ఒక్కరూ కూడా ఉండలేకపోవడం ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది.

అలాగే తమిళనాడులోని ధనుష్కోడి పట్టణం గురించి చాలామంది వినే ఉంటారు. అది ఒకప్పుడు దక్షిణ భారత దేశంలోనే అతిపెద్దది అలాగే కీలకమైన రేవు పట్టణం. ఇక్కడి నుంచే శ్రీలంకకు రవాణా జరిగేది. కానీ 1964లో వచ్చిన భీకరమైన తుపాను ఈ ధనుష్కోడి పట్టణాన్ని నాశనం చేసేసింది.

ఇళ్లతో పాటు రైలు పట్టాలు, చర్చిలు, రైల్వే స్టేషన్, అన్నీ కూడా సముద్రపు అలల ధాటికి కొట్టుకుపోయాయి.తర్వాత ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం నివాసానికి యోగ్యం కాని ప్రాంతంగా ప్రకటించడంతో అది ఒక శిథిల నగరంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఇక్కడ కేవలం ఇసుక మేటలు వేసిన గోడలు మాత్రమే కనిపిస్తాయి.

Ghost Towns

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కనుక చూస్తే ఉక్రెయిన్ లోని ప్రిప్యాట్ నగరం కూడా దీనికి మరో ఉదాహరణ. 1986లో జరిగిన చెర్నోబిల్ అణు ప్రమాదం వల్ల ఆ నగరం గంటల వ్యవధిలోనే ఖాళీ చేయబడింది. అక్కడ ఇప్పటికీ పాఠశాలల్లో పుస్తకాలు, ఇళ్లలోని వస్తువులు అలాగే శిథిలావస్థలో ఉండిపోయాయి, కానీ మనుషులు మాత్రం ఉండరు.

కాలగర్భంలో కలిసిపోయిన ఇలాంటి ఊర్లే.. మనందరికీ కూడా చరిత్ర పాఠాలను గుర్తుచేస్తూనే..మనిషి నిర్మించిన నాగరికత ప్రకృతి ముందు ఎంత బలహీనమైనదో నిరూపించడానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పటికీ ఈ గోస్ట్ టౌన్స్( Ghost Towns) లో వినిపించే గాలి శబ్దాలు, పాడుబడిన భవనాలు సందర్శకులకు ఒక వింతైన, ఒళ్లు గగుర్పొడిచే అనుభూతిని కలిగిస్తాయి.

అభివృద్ధి పేరుతో మనం నిర్మించుకున్నవి ఎలాంటివి అయినా కూడా కాలక్రమంలో ఎలా మట్టిలో కలిసిపోతాయో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. ఈ నగరాల చుట్టూ ఉన్న చరిత్ర కథలు, అక్కడ కనిపించే నిశ్శబ్ధమైన శూన్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని సందర్శించడం అంటే కేవలం పర్యటన మాత్రమే కాదని, గతాన్ని తవ్వి చూడటం వంటిదని భావిస్తుంటారు.

IND vs PAK : భారత్ శివతాండవం.. చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్

Exit mobile version