SP Balasubrahmanyam
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramanyam) విగ్రహాన్ని హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా జరగనుంది.
ముఖ్య అతిథులు..ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరు కానున్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు సినీ సంగీత స్వరనీరాజనం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు తెలిపారు.
అయితే, ఈ విగ్రహం ఏర్పాటు విషయంలో కొద్దిరోజులుగా వివాదం నెలకొంది. ఈ వార్త వెలువడిన దగ్గర నుంచి, రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) విగ్రహ ఏర్పాటుపై కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లను, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో నటుడు శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. శుభలేఖ సుధాకర్తో పాటు, కమిటీ సభ్యులతో కలిసి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్,తెలంగాణ గడ్డపై గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి వారికి ముందు గౌరవం దక్కాలని, బయటి వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించబోమని తీవ్రంగా వాదించారు. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రవీంద్రభారతిలో ఎస్పీబీ (SP Balasubrahmanyam)విగ్రహ ఏర్పాటును తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
