Attacks
పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రమైన తర్వాత, రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల పాటు కొనసాగిన ఈ సరిహద్దు ఘర్షణల వల్ల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో, పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ కాల్పుల(Attacks) విరమణకు అంగీకరించాయి. బుధవారం సాయంత్రం నుంచి 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణకు పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ అంగీకరించినట్లు పాక్ పత్రిక డాన్ నివేదించింది.
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం (FO) ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధృవీకరించింది. అఫ్ఘాన్ తాలిబన్ పాలన అభ్యర్థన మేరకు “రెండు పార్టీల పరస్పర అంగీకారంతో” ఈ ఒప్పందం జరిగినట్లు వివరించింది. ఈ 48 గంటల సమయంలో నిర్మాణాత్మక సంభాషణ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరుపక్షాలు నిజాయితీగా ప్రయత్నాలు చేస్తాయని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
అఫ్ఘాన్ భూభాగం నుంచి జరిగిన దాడులకు ప్రతిస్పందనగా, కాందహార్, కాబూల్లోని కీలక తాలిబన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కచ్చితమైన దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది. ఈ దాడుల్లో 23 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 29 మంది గాయపడ్డారని తెలుస్తోంది.
కాబూల్లోని తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) స్థావరాలపై గత వారం పాక్ సైన్యం దాడి చేసింది. తాము టీటీపీకి ఆశ్రయం ఇవ్వడం లేదని, పాకిస్థాన్ ఆరోపణల్లో నిజం లేదని అఫ్ఘానిస్థాన్ కొట్టిపారేసింది. కాబూల్పై దాడులకు ప్రతీకారంగా పాక్ సరిహద్దుల్లోని ఔట్పోస్టులపై తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. దాంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.