Ambulance
మనిషి జీవితంలో ప్రమాదం జరిగిన మొదటి గంటను.. వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ఈ టైములో సరైన వైద్యం అందితే ..చనిపోయే ప్రాణం కూడా తిరిగి బతుకుతుంది. అలా కాపాడాల్సిన 108 అంబులెన్స్(Ambulance) సేవలు అస్తవ్యస్తంగా ఉండి, ఫోన్ చేస్తే వస్తుందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది.
కానీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గతంతో పోలిస్తే ఈ అత్యవసర సేవలు ఇప్పుడు 45 రెట్లు పెరిగాయి. దీనివల్ల కేవలం కొద్ది కాలంలోనే ఏకంగా పదివేల ఐదు వందల ఎనభై నాలుగు మంది ప్రాణాలను సకాలంలో కాపాడగలిగారు. ఇదొక సాధారణ సంఖ్య కాదు, పదివేల కుటుంబాల్లో ఆరిపోకుండా కాపాడిన వెలుగు అనే చెప్పాలి.
ప్రస్తుతం అంబులెన్స్ చాలా ఫాస్టుగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సిటీలో ఫోన్ చేసిన పద్దెనిమిది నిమిషాల్లోనే అంబులెన్స్ వారి ముంగిటకు చేరుతోంది. పల్లెల్లో ఇరవై రెండు నిమిషాలు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ముప్పై మూడు నిమిషాల వ్యవధిలోనే ట్రీట్మెంట్ అందుతోంది. కేవలం వేగమే కాదు, టెక్నాలజీని కూడా ఈ సేవలలో జోడించడం ఒక గొప్ప ముందడుగుగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
దేశంలోనే తొలిసారిగా ఈ అంబులెన్సుల్లో లైవ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల రోగి హాస్పిటల్కి వెళ్లేలోపే అక్కడ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు లైవ్ వీడియో ద్వారా పేషెంట్ పరిస్థితిని గమనిస్తూ, అంబులెన్స్లోని పారామెడికల్ సిబ్బందికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్పై సూచనలు ఇస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రికి చేరుకోకముందే ప్రాథమిక చికిత్స కానీ, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కానీ పూర్తయిపోతుంది.
ఏపీ వ్యాప్తంగా సుమారు 731 అత్యాధునిక అంబులెన్సులను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది కొరతను తీర్చి, నిరంతరం కాల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పెంచడం వల్ల ప్రతి ఫోన్ కాల్ను ఒక ప్రాణంతో సమానంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, పాము కాటు వంటి అత్యవసర సమయాల్లో క్షణాల్లో స్పందించి ప్రాణాలను 108 కాపాడుతుంది.
ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తూ, 108 సేవలను ఒక ‘లైఫ్ లైన్’గా మార్చడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఇప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది, ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే అంబులెన్స్ కచ్చితంగా వస్తుందనే భరోసా వేలాది మందికి వచ్చింది.
