Ranya Rao:కన్నడ నటి రన్య రావు(Ranya Rao) కేసులో ఆమె ఏమాత్రం అనుకోని పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన కేసులో ఆమెకు ఏడాది పాటు జైలు శిక్ష ఖరారైంది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు (COFEPOSA) అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రన్యరావుతో పాటు ఆమె భాగస్వామి తరుణ్, మరో వ్యక్తి సాహిల్కు కూడా ఇదే శిక్షను ఖరారు చేసినట్టు బోర్డు ప్రకటించింది.
Ranya Rao
రన్య రావు కేసుపై దర్యాప్తు చేసిన అధికారులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. రన్యరావు, ఆమె సహచరుడు తరుణ్ కలిసి దుబాయ్లో ఒక వజ్రాల కంపెనీని స్థాపించారని, దానిని భారతదేశంలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా(Gold Smuggling) చేయడానికి దానిని ఉపయోగించారని తేలింది.
రన్యా తన VIP హోదాను దుర్వినియోగం చేసి భద్రతా తనిఖీలను తప్పించుకుందని, ఎయిర్పోర్టులో చెకింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ఆమె పినతండ్రి పేరును ఉపయోగించుకున్నారని దర్యాప్తులో స్పష్టమైంది. అయితే, ఆమె తండ్రి మాత్రం తాను కూతురుతో కలిసి ఉండటం లేదని, ఈ విషయాలు తనకు మీడియా ద్వారానే తెలిశాయని, చాలా షాకయ్యానని చెప్పారు.
ఈ కేసులో రన్యాను దోషిగా నిర్ధారించేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కారణంగా శిక్షా కాలంలో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు. వారు బెయిల్ కోసం ప్రయత్నించినా ఎలాంటి ఫలితాలు ఉండవని సమాచారం. దీంతో జైలు శిక్ష పడిన ఈ ముగ్గురు నిందితులు శిక్ష పూర్తయ్యేంత వరకు అంటే ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి విచారణలు జరుగుతాయని బోర్డు వెల్లడించింది.
2024 మార్చి 3వ తేదీన దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో రన్యారావు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ(DRI) అధికారులు ..బెంగళూరులోని లవెల్లే రోడ్లో ఉన్న ఆమె నివాసంపై అధికారులు దాడులు నిర్వహించి, 2.06 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలు, 2.67 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆమెకు సహకరించిన తరుణ్, సాహిల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.
కాగా, మాణిక్య అనే కన్నడ మూవీ..రన్యరావు డెబ్యూ చిత్రం. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన రెండో హీరోయిన్గా నటించి, తన కెరీర్లో ఇదే అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 100 రోజులు థియేటర్లలో విజయవంతంగా నడిచింది.మాణిక్య తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆమె కొంతకాలంగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఈ బంగారం స్మగ్లింగ్ కేసుతో మరోసారి వార్తల్లో నిలిచారు.