Srivari Hundi
తిరుమల క్షేత్రం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరస్వామి. భక్తులు తమ కోర్కెలు తీరితే స్వామివారికి హుండీలో కానుకలు సమర్పిస్తారు. అయితే ఈ హుండీ వెనుక ఉన్న ఆధ్యాత్మిక , పౌరాణిక వివరణ చాలా లోతైనదని పురాణాలు చెబుతున్నాయి.
పురాణాల ప్రకారం, పద్మావతీ అమ్మవారితో తన వివాహం కోసం వేంకటేశ్వర స్వామివారు కుబేరుడి వద్ద ఒక కోటి గడ్యాల బంగారాన్ని అప్పుగా తీసుకున్నారట. ఆ అప్పునకు కేవలం వడ్డీ మాత్రమే యుగాంతం వరకు చెల్లిస్తానని స్వామివారు కుబేరుడికి వాగ్దానం చేశారట.
అందుకే ఇప్పటికీ భక్తులు సమర్పించే కానుకలన్నీ ఆ అప్పు తీర్చడానికే శ్రీనివాసుడు వినియోగిస్తారని భక్తుల నమ్మకం . కానీ శ్రీవారి హుండీ వెనుక ఉన్న అసలు అంతరార్థం అహాన్ని త్యాగం చేయడం అని పురాణాలు చెబుతాయి. ఒక మనిషి తాను ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నాడంటే, ఆ ధనంపై తనకున్న మమకారాన్ని వదులుకుంటున్నాడని దీని అర్థమట.
నిజానికి హుండీలో వేసే ప్రతి నాణెం మనిషిలో ఉన్న లోభగుణాన్ని తగ్గించి, దైవచింతనను పెంచుతుంది. తిరుమలలో శ్రీవారి హుండీ(Srivari Hundi) ని ‘గంగాలం’ అని కూడా పిలుస్తారు. అందుకే ఈ హుండీని నింపడం అంటే అనంతమైన దైవ కార్యంలో మనం కూడా ఒక భాగస్వామ్యం పొందడమే అంటారు పండితులు.
కలియుగ వైకుంఠంలో స్వామివారు భక్తుల కష్టాలను తనపై వేసుకుని, దానికి ప్రతిగా భక్తులు ఇచ్చే చిరు కానుకలను, మొక్కులను స్వీకరిస్తూ అందరినీ చల్లగా చూస్తుంటారు. శ్రీవారి హుండీ (Srivari Hundi) సంప్రదాయం కేవలం ధన సేకరణ కాదు, అది భక్తుడికి , భగవంతుడికి మధ్య ఉన్న ఒక అదృశ్య అనుబంధంగా సాగుతోంది.ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో తమ సంపాదనలో కొంత భాగాన్ని ఏడుకొండల స్వామివారికి అర్పిస్తారో, వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుందని భక్తుల నమ్ముతారు.
