IND vs NZ 3rd T20
కొత్త ఏడాదిలో తొలి సిరీస్ విజయానికి భారత్ అడుగుదూరంలో నిలిచింది. టీ20 ప్రపంచకప్ కు ముందు అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయినా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ లో మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో వరుసగా రెండు టీ20ల్లోనూ దుమ్మురేపేసింది. నాగ్ పూర్, రాయ్ పూర్ లలో కివీస్ ను చిత్తు చేసి ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ప్రస్తుతం భారత బ్యాటర్లు అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు.
తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ చెలరేగితే.. రెండో టీ ట్వంటీలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ , హార్థిక్ అదరగొట్టారు. అయితే సంజూ శాంసన్ మాత్రం ఇంకా గాడిన పడలేదు. రెండు మ్యాచ్ లలోనూ నిరాశపరిచాడు. ఈ సిరీస్ లో సంజూ ఫామ్ అందుకోకుంటే మాత్రం ప్రపంచకప్ లో తుది జట్టులో అతన్ని పక్కన పెట్టేసే అవకాశముంది. అలాగే శివమ్ దూబే , రింకూ సింగ్ కూడా రాణిస్తున్నారు. మరోవైపు బౌలింగ్ మాత్రం కాస్త టెన్షన్ పెడుతోంది. గత మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ భారీగా పరుగులిచ్చి చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
న్యూజిలాండ్,భారత్ మూడో టీ ట్వంటీ (IND vs NZ T20) కోసం భారత తుది జట్టులో మార్పులు జరగడం ఖాయమని భావిస్తున్నారు. తొలి టీ ట్వంటీలో గాయపడిన అక్షర్ పటేల్ రెండో మ్యాచ్ లో ఆడలేదు. ఒకవేళ కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తే కుల్దీప్ యాదవ్ స్థానంలో రీఎంట్రీ ఇస్తాడు. అలాగే స్టార్ పేసర్ బుమ్రా కూడా తుది జట్టులోకి రావడం ఖాయం. కానీ హర్షిత్ రాణా, అర్షదీప్ లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి.
మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరిగా మారింది. బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్ లో మాత్రం కివీస్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. డఫీ తప్పిస్తే మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను కట్టడి చేయాలంటే కివీస్ బౌలింగ్ గాడిన పడాల్సిందే. గత మ్యాచ్ లో భారీస్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతోనే ఓడిపోయింది.
దీంతో తమ పేసర్లు ఫామ్ అందుకోవాలని కివీస్ మేనేజ్ మెంట్ ఎదురుచూస్తోంది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గుహావటి పిచ్ కూడా బ్యాటర్లకే అనుకూలం. తొలి రెండు మ్యాచ్ ల తరహాలోనే భారీస్కోర్లు నమోదవుతాయని అంచనా. 2023లో ఇక్కడ టీ20 జరిగినప్పుడు ఆస్ట్రేలియా 222 పరుగుల టార్గెట్ ను ఛేదించింది.
T20 World cup : బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్.. ఐసీసీ కీలక నిర్ణయం
