T20
భారత్, న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ క్లైమాక్స్ కు చేరింది. తిరువనంతపురం వేదికగా కివీస్ తో చివరి టీ ట్వంటీ ఆడబోతోంది. వన్డే సిరీస్ పరాభవాన్ని మరిపిస్తూ హ్యాట్రిక్ విజయాలతో టీ20(T20) సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు గత మ్యాచ్ లో మాత్రం చుక్కెదురైంది. తుది జట్టులో ప్రయోగాలతో మూల్యం చెల్లించుకుంది. అదే సమయంలో మెగాటోర్నీకి ముందు గెలుపు బాటలోకి వచ్చిన కివీస్ ఫుల్ జోష్ తో కనిపిస్తోంది.
ఇప్పుడు టీ20(T20) ప్రపంచకప్ కు ముందు ఇరు జట్లకు ఇది చివరి మ్యాచ్ కావడంతో విజయంతో ముగించాలని భావిస్తున్నాయి. సిరీస్ గెలిచిన భారత్ కు నాలుగో టీ ట్వంటీలో ఓటమి ఒకవిధంగా గుణపాఠమే. కాంబినేషన్ విషయంలో ఇక ప్రయోగాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గత మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యం కొంపముంచింది. అయితే బ్యాటింగ్ పరంగా సంజూ శాంసన్ తప్పిస్తే కీలక ఆటగాళ్లంతా ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం.
సంజూ మాత్రం వైఫల్యాల బాట వీడడం లేదు. నాలుగో టీ ట్వంటీలో చక్కని అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టచ్ లోకి వచ్చినట్టే కనిపించినా పేలవ ఫుట్ వర్క్ తో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో మెగాటోర్నీకి తుది జట్టులో తన చోటే గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హోంగ్రౌండ్ లో సంజూ చెలరేగాలని అటు మేనేజ్ మెంట్, ఇటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు.
టీట్వంటీల్లో(T20) తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అలాగే గత మ్యాచ్ కు దూరమైన ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రానున్నాడు. ఇషాన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్ తో ఫామ్ అందుకున్నారు. దీంతో మెగాటోర్నీకి ముందు చాలా వరకూ భారత్ టెన్షన్ లు తీరినట్టే. అటు హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్ కూడా సత్తా చాటుతున్నారు. అదే సమయంలో శివమ్ దూబే నాలుగో టీ ట్వంటీలో విధ్వంకర ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి తన స్టామినా ఏంటో చాటి చెప్పాడు. దూబే ఫినిషర్ రోల్ లో కీలకం కాబోతున్నాడు.
మరోవైపు బౌలింగ్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు నెలకొన్నాయి. బుమ్రా పర్వాలేదనిపిస్తున్నా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా నిలకడగా రాణించడం లేదు. అర్షదీప్ తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. అటు హర్షిత్ రాణా వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పేసర్లు సమిష్టిగా రాణించేందుకు ఈ మ్యాచ్ చివరి అవకాశం. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లలో ఇద్దరికే చోటు దక్కుతుంది.
అక్షర్ పటేల్ కోలుకుంటే తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు కుల్దీప్ యాదవ్ కు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా మెగాటోర్నీకి ముందు తమ విన్నింగ్ ఫామ్ కొనసాగించాలని భావిస్తోంది.గత మ్యాచ్ లో కీలక బ్యాటర్లు సమిష్టిగా రాణించి భారీస్కోరుకు కారణమయ్యారు. బౌలింగ్ లోనూ సమిష్టిగా రాణించిన కివీస్ చివరి మ్యాచ్ లోనూ భారత్ ను ఓడించి మెగాటోర్నీకి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలని పట్టుదలగా ఉంది.
తిరువనంతపురం పిచ్ సహజంగా బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్లో బౌలర్లకు అడ్వాంటేజ్ లభిస్తుంది. ఫలితంగా బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ లు ఆడడం కాస్త కష్టమే.
