India Pakistan:క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్..భారత్, పాక్ మ్యాచ్‌కు లైన్ క్లియర్

India Pakistan: సుధీర్ఘ మంతనాల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది.

India Pakistan

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కిక్ ఇచ్చే న్యూస్.. టీ20 ప్రపంచకప్ కు మరింత ఊపు రాబోతోంది. రెండు వారాలుగా సందిగ్ధత నెలకొన్న భారత్, పాకిస్థాన్(India Pakistan) మ్యాచ్ పై క్లారిటీ వచ్చేసింది. సుధీర్ఘ మంతనాల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. దీనిపై పాక్ ప్రభుత్వం నుంచి కూడా పీసీబీకి అనుమతి లభించింది.

రెండు రోజులుగా లాహోర్ లోనే మకాం వేసిన ఐసీసీ అధికారులు పీసీబీని మెట్టు దింపడంలో విజయవంతమయ్యారు. బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలకు నిరసనగా ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ను తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. చినికి చినికి గాలివానగా మారినట్టు బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడం, వారికి మద్ధతుగా పాక్ కూడా భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేయడం వంటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసాయి.

ఒక దశలో బ్రాడ్ కాస్టర్లు పీసీబీని కోర్టుకు లాగే వరకూ ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఈ మ్యాచ్ రద్దయితే రెండు దేశాల బోర్డులు, ఐసీసీ తో పాటు బ్రాడ్ కాస్టర్లు భారీగా నష్టపోనున్నారు. దీంతో ఐసీసీ అన్ని విధాలా ప్రయత్నించి ఎట్టకేలకు పీసీబీని దారిలోకి తీసుకొచ్చింది. ఐసీసీ చర్చలు ఫలించకముందు పాక్ బోర్డు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.

India Pakistan

వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడాలంటే పాక్ బోర్డు ఐసీసీ ముందు కొన్ని కండీషన్లు పెట్టింది. రెవెన్యూలో వాటా పెంచడం, భారత్-పాక్(India Pakistan) ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు మెరుగయ్యేలా చూడడం, అలాగే భారత్, పాక్ , బంగ్లాదేశ్ మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలని పీసీబీ కోరింది. దీనికి ఐసీసీ కూడా దీటుగానే స్పందించింది.

ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల విషయంలో తాము ఏమీ చేయలేమని ఐసీసీ తేల్చేసింది. అలాగే ట్రై సిరీస్ అంశంలోనూ ఎలాంటి హామీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. భారత్ తో మ్యాచ్ రద్దయితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో మరోసారి పీసీబీకి గుర్తు చేసింది. దీంతో పునరాలోచనలో పడిన పాక్ బోర్డు తమ ప్రభుత్వంతో చర్చించి చేసేదేం లేక చివరకు భారత్ తో మ్యాచ్ ఆడేందుకు మొగ్గు చూపించింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version