IAS officers :10 మంది ఐఏఎస్ అధికారుల షఫుల్..ఎందుకీ నిర్ణయం? ఎవరికి ఏ బాధ్యత?

IAS officers : మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులతో పాటు, పలువురు ఐఎఫ్ఎస్ ,డెప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు.

IAS officers

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల (IAS officers)భారీ బదిలీలను చేపట్టింది. డిసెంబర్ 30, 2025న వెలువడిన ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారుల(IAS officers)తో పాటు, పలువురు ఐఎఫ్ఎస్ ,డెప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు.

కేవలం అధికారుల మార్పు మాత్రమే కాకుండా, జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, జీహెచ్‌ఎంసీ (GHMC) 12 జోన్ల పునర్విభజన ప్రక్రియను స్పీడప్ చేయడమే ఈ బదిలీల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా నిజామాబాద్, నల్గొండ వంటి కీలక జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త ఊపునివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ బదిలీల్లో అత్యంత కీలకమైనది టి. వినయ్ కృష్ణారెడ్డి మార్పు. 2013 బ్యాచ్‌కు చెందిన ఈయన, ఇప్పటివరకు నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు ఆయనను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమిస్తూ, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల బాధ్యతలను అప్పగించారు.

ఈ జోన్లు ఐటీ హబ్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కావడంతో, గతంలో యాదాద్రి, సూర్యాపేట కలెక్టర్‌గా పనిచేసిన ఆయన అనుభవం ఇక్కడ ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న జోన్ల పునర్విభజన సమయంలో వినయ్ కృష్ణారెడ్డి వంటి సీనియర్ అధికారుల అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

IAS officers

నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఇలా త్రిపాఠి (2017 బ్యాచ్) నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. టూరిజం డైరెక్టర్‌గా, రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఇలా త్రిపాఠి, నల్లగొండలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పారిశ్రామిక అభివృద్ధిపై ఆమె దృష్టి సారించనున్నారు.

అదే సమయంలో, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా యువ ఐఏఎస్ అధికారి (IAS officers)బడుగు చంద్రశేఖర్‌ను నియమించడం విశేషం. 2018 బ్యాచ్‌కు చెందిన చంద్రశేఖర్, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు స్థానిక సంస్థల బలోపేతంలో తనదైన ముద్ర వేశారు. నల్లగొండలో నెలకొన్న జల సమస్యలు , వ్యవసాయ ప్రాజెక్టులకు ఈయన కొత్త ఆలోచనలు తోడవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

మరోవైపు మహిళా , శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న జి. శ్రీజన , శృతి ఓఝా (ఇద్దరూ 2013 బ్యాచ్) కు కూడా కీలక బాధ్యతలు దక్కాయి. జి. శ్రీజనను పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా నియమించగా, శృతి ఓఝాను అదే శాఖలో కమిషనర్‌గా నియమించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో వీరిద్దరికీ ఉన్న అనుభవం తెలంగాణ పల్లెల అభివృద్ధికి ప్లస్ కానుంది.

అలాగే డాక్టర్ టీకే శ్రీదేవి (2004 బ్యాచ్) ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. సీనియర్ అధికారిగా ఆమెకు ఉన్న అనుభవం మున్సిపల్ సంస్కరణలను అమలు చేయడంలో కీలకం కానుంది.

IAS officers

ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా పనిచేసిన హనుమంత రావును యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియమించారు, తద్వారా అక్కడ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది.

ఈ షఫుల్ కేవలం ఒక సాధారణ మార్పు మాత్రమే కాదు, ఇది ‘పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్’ లో భాగంగా జరిగిన ప్రక్రియ. పనితీరు ఆధారంగా అధికారులను వారికి తగిన పోస్టుల్లో నియమించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను వేగంగా చేరుకోవచ్చని సీఎం భావిస్తున్నారు. ఈ బదిలీల వల్ల జీహెచ్‌ఎంసీ పరిధిలో పాలనాపరమైన ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, జిల్లాల్లో సాగునీరు, వ్యవసాయం , సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా జరుగుతుందని ఆశించొచ్చు. కొత్త ఏడాది ఆరంభంలో ఈ అధికారులు తమ కొత్త బాధ్యతలను స్వీకరించనుండటంతో, తెలంగాణాలో పాలన మరింత కొత్తగా ఉండబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version