Railway:రైల్వే ప్రయాణికులకు తిప్పలు.. ఏ రూట్‌లో, ఎందుకు, ప్రత్యామ్యాయ రూట్ ఏంటి?

Railway: ఈ రైళ్ల రద్దు వల్ల ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడతారు.

Railway

తెలంగాణలోని కీలక రైల్వే జంక్షన్ అయిన కాజీపేట మీదుగా రైలు ప్రయాణం చేసేవారికి రైల్వే(Railway) శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. కాజీపేట – బల్లార్ష సెక్షన్‌లోని మందమర్రి , బెల్లంపల్లి స్టేషన్ల మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కోసం ఫిబ్రవరి 14 వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దక్షిణ, ఉత్తర భారతదేశాన్ని కలిపే ఈ కీలక మార్గంలో రైళ్ల రద్దు వల్ల వేలాది మంది నిత్య ప్రయాణికులు, పారిశ్రామిక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ రైళ్ల రద్దు వల్ల ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడతారు.

మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి.. ఈ బొగ్గు గని ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు ప్రతిరోజూ కాజీపేట మీదుగా హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు.
రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్..పారిశ్రామిక ప్రాంతాల ప్రయాణికులు ఇప్పుడు ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది.
బల్లార్ష (మహారాష్ట్ర).. తెలంగాణ నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రద్దు పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు..

పూర్తిగా రద్దు.. కాజీపేట – సిర్పూర్ టౌన్ (17003), బల్లార్ష – కాజీపేట (17004), బల్లార్ష – కాజీపేట (17036), , కాజీపేట – బల్లార్ష (17035) ఎక్స్‌ప్రెస్ రైళ్లు పూర్తిగా నిలిపివేశారు.
పాక్షికంగా రద్దు.. భద్రాచలం రోడ్ – బల్లార్షా (17033) సింగరేణి ప్యాసింజర్, సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్ (17034) సింగరేణి ప్యాసింజర్ రైళ్లు కొన్ని స్టేషన్ల మధ్య మాత్రమే నడవనున్నాయి.

రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

Railway

కాజీపేట నుంచి మంచిర్యాల/బెల్లంపల్లి.. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి అలాగే చెన్నూర్ వైపు వెళ్లే టీఎస్‌ఆర్‌టీసీ బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. జాతీయ రహదారి 63 (NH-63) ద్వారా ఈ ప్రయాణం ఈజీగా ఉంటుంది.

భద్రాచలం నుంచి బల్లార్ష.. భద్రాచలం నుంచి మణుగూరు, కొత్తగూడెం మీదుగా మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుంచి మరో బస్సులో బల్లార్ష వెళ్లొచ్చు.
ప్రత్యేక రైళ్లు.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొన్ని దారి మళ్లింపుతో నడుస్తున్నాయి. ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్ 139 లేదా అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవడం ఉత్తమం.

మందమర్రి – బెల్లంపల్లి మధ్య రైల్వే(Railway) లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ పనులు తప్పనిసరి, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. ప్రయాణానికి ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు కలగవు అని ప్రయాణికులు ముందే గమనించాలి.

Gold prices:పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు!

Exit mobile version