Telangana Thalli
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి (Telangana Thalli) గ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఆవిష్కరించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగింది.
గతంలో రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి(Telangana Thalli)విగ్రహాన్ని ఏ నమూనాలో అయితే ప్రతిష్టించారో, అదే సాంప్రదాయ నమూనాను రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకరీతి సంస్కృతి, రాష్ట్ర చిహ్నంపై గౌరవాన్ని ప్రతిబింబించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
తెలంగాణ రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఒక్కో విగ్రహానికి రూ. 17.50 లక్షల చొప్పున మొత్తం రూ. 5.8 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరించింది.
విగ్రహం రూపకల్పన వివరాలు..తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో రాష్ట్ర సంస్కృతి, మహిళా స్వభావాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
విగ్రహం మొత్తం ఎత్తు 18 అడుగులు. ఇందులో విగ్రహం ఎత్తు 12 అడుగులు కాగా, దిమ్మె (పీఠం) ఎత్తు 6 అడుగులు ఉంది.
విగ్రహానికి ప్రత్యేకంగా ఆకుపచ్చ చీరను పసుపు పచ్చ బంగారు అంచులతో అలంకరించారు. ఇది తెలంగాణ మహిళా సంప్రదాయాన్ని, పచ్చని వ్యవసాయ క్షేత్రాలను ప్రతిబింబిస్తుంది.తెలంగాణ తల్లి విగ్రహం తన ఎడమ చేతిలో రాష్ట్రంలోని ప్రధాన పంటలైన మొక్కజొన్న, సజ్జ , గోధుమ పంటలను అలంకారంగా ఉంచారు. ఇది తెలంగాణ వ్యవసాయ సంస్కృతికి నిదర్శనం.
నుదుటిపై ఎర్రటి బొట్టు, చెవులకు కమ్మలు, మెడలో సంప్రదాయ గుండుపూసల హారం, చేతులకు మట్టిగాజులు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక వంటి సాంప్రదాయ ఆభరణాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
ఈ విగ్రహాల ఆవిష్కరణతో తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ ఒక ఐకానిక్ చిహ్నం ఆవిష్కృతమైంది.
