Wild Animals
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఎన్.హెచ్-161 (NH-161) నేషనల్ హైవేపై చిరుత సంచారం తాజాగా కలకలం రేపింది. కేవలం మెదక్ మాత్రమే కాదు..తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య పులులు, చిరుతలు, ఏనుగులు సంచారం గ్రామాల్లో బాగా పెరుగుతోంది. అయితే వన్యప్రాణులు(wild Animals) రోడ్ల మీదకు రావడానికి గల లోతైన కారణాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన నిజాలు బయటపడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయంటే..
తెలంగాణలో చూసుకుంటే అదిలాబాద్ లోని కావాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్.. మహారాష్ట్రలోని తడోబా నుంచి పులులు ఇక్కడికి వలస వస్తున్నాయి.
అలాగే మెదక్లోని పోచారం అభయారణ్యంలో చిరుతల సంఖ్య పెరగడంతో అవి అల్లాదుర్గం వంటి జాతీయ రహదారుల (NH-161) మీదకు వస్తున్నాయి.
నల్లమలలోని అమ్రాబాద్ పులులకు అతిపెద్ద నిలయం. ఇక్కడి నుంచి నాగర్ కర్నూల్, నల్గొండ సరిహద్దుల్లోకి ఇవి తరచూ వస్తున్నాయి.
హైదరాబాద్ శివారు ప్రాంతాలయిన గచ్చిబౌలి, గ్రేటర్ హైదరాబాద్ అంచుల్లో ఉన్న ఫామ్ హౌస్ల వద్ద కూడా చిరుతల సంచారం పెరుగుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీశైలం – నాగార్జున సాగర్ మధ్యఉన్న నల్లమల దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ పులుల సాంద్రత పెరగడంతో అవి ప్రకాశం, కర్నూలు జిల్లాల గ్రామాల్లోకి వస్తున్నాయి.
అలాగే శేషాచలం అడవులు వన్యమృగాలకు కేరాఫ్ కావడంతో.. తిరుపతి చుట్టుపక్కల చిరుతల గురించి సంచారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.అలాగే ఒడిశా సరిహద్దుల నుంచి చిరుతలు శ్రీకాకుళం, విజయనగరం తోటల్లోకి వస్తున్నాయి.
వన్య ప్రాణులు(wild Animals) అడవిని వదిలి ఎందుకు వస్తున్నాయనే దానికి అధికారులు కొన్ని కారణాలు చెబుతున్నారు.
వన్య ప్రాణుల సంఖ్య పెరుగుతోంది..దీంతో అడవి సరిపోవడం లేదు. ప్రాజెక్ట్ టైగర్ , అటవీ సంరక్షణ చర్యల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
తెలంగాణలో కావాల్, అమ్రాబాద్, పోచారం ప్రధాన కేంద్రాలుగా.. 2022లో 21గా ఉన్న పులుల సంఖ్య ఇప్పుడు 35 దాటింది. చిరుతలు 1,200 నుంచి 1,800 పైగా పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ నల్లమల ప్రధాన కేంద్రంగా.. పులుల సంఖ్య 58 నుంచి 85కు పెరిగింది. చిరుతలు 2,200 పైగా ఉన్నట్లు అంచనా.
ఒక మగ పులికి సుమారు 50 నుంచి 100 చదరపు కి.మీటర్ల సొంత సామ్రాజ్యం కావాలి. ఇప్పుడు అడవుల్లో పులుల సంఖ్య పెరిగింది . ఉదాహరణకు 2022లో 79 ఉంటే, 2026 నాటికి 120 దాటాయి.. పెద్ద పులుల ధాటికి తట్టుకోలేక, చిన్న వయసున్న పులులన్నీ తమకంటూ ఒక కొత్త ఏరియాను వెతుక్కోవడం కోసం అడవి బయటకు వచ్చేస్తున్నాయి.
ఒకప్పుడు అడవులన్నీ కలిసి ఉండేవి. కానీ ఇప్పుడు అడవులను ఆక్రమించి నిర్మించిన హైవేలు, భారీ ఇరిగేషన్ కెనాల్స్, క్వారీలు అడవుల మధ్యకు వచ్చేశాయి. దీనివల్ల అవి ఒక అడవి నుంచి ఇంకో అడవికి వెళ్లడానికి దారి లేక, రోడ్ల మీదకు రావాల్సి వస్తోంది.
అంతేకాకుండా అడవుల్లో జింకలు, అడవి పందుల సంఖ్య తగ్గిపోవడం వల్ల పులులకు శ్రమ లేకుండా దొరికే పశువులు ఆహారంగా కనిపిస్తున్నాయి. అడవిలో గంటల తరబడి శ్రమపడి వేటాడే కంటే, గ్రామం అంచున ఉన్న పశువుల పాకపై దాడి చేయడమే వీటికి ఈజీగా మారింది.
అంతేకాదు వేసవి కాలం రాకముందే అడవుల్లోని వాగులు ఎండిపోవడంతో , నీటిని వెతుక్కుంటూ చిరుతలు,పెద్ద పులులు అడవి అంచున ఉన్న పొలాల్లోకి, కుంటల్లోకి వస్తున్నాయి.
అలాగే మహారాష్ట్ర (తడోబా) నుంచి తెలంగాణకు (కావాల్) ఒక సహజమైన దారి ఉంది. పులులు తమ వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి అలా వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి.
నిజానికి వన్యప్రాణుల సంఖ్య పెరగడమనేది పర్యావరణ పరంగా ఒక విజయమే. అయితే, ఆ పెరిగిన జనాభాకు సరిపడా అడవి విస్తీర్ణం లేకపోవడం వల్లే..అవి ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చి జనాలను భయపెడుతున్నాయి.
