Red Fort
భారతదేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన ఒక దొంగతనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో, ఒక జైన మతపరమైన ఆచారం నుంచి కోటి రూపాయల విలువైన బంగారు కలశం దొంగిలించబడింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2, మంగళవారం నాడు జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎర్రకోట(Red Fort) పార్కులో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 9 వరకు జైన సమాజం ఆధ్వర్యంలో ఒక పూజ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు ఒక వ్యాపారవేత్త సుధీర్ జైన్ అత్యంత విలువైన కలశాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించేవారు. సెప్టెంబర్ 2న, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలుకుతున్న సమయంలోనే, ఆ కలశం అదృశ్యమైంది.
వెంటనే స్పందించిన పోలీసులు, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అందులో ఒక వ్యక్తి ఈ కలశాన్ని దొంగిలిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు నిందితుడిని కూడా గుర్తించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి, కలశాన్ని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు.
దొంగిలించబడిన కలశం చాలా అరుదైనది, అత్యంత విలువైనది అని పోలీసులు తెలిపారు. దాని మొత్తం విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కలశం 760 గ్రాముల బంగారంతో తయారు చేయబడింది. దానిపై 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయి. ఇంత విలువైన కలశం దొంగతనం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎర్రకోట(Red Fort)లో ఈ దొంగతనం జరగడం భద్రతా లోపాలను మరోసారి బయటపెట్టింది. దీనికి ముందు, ఆగస్టు 2న జరిగిన ఒక సంఘటన కూడా పోలీసుల నిర్లక్ష్యాన్ని చూపించింది. స్వాతంత్ర్య దినోత్సవ రిహార్సల్స్లో భాగంగా, స్పెషల్ సెల్ బృందం సాధారణ దుస్తుల్లో ఒక నకిలీ బాంబును ఎర్రకోటలోకి తీసుకువెళ్లింది. కానీ, భద్రత కోసం మోహరించిన పోలీసులు ఆ బాంబును గుర్తించలేకపోయారు. ఆ నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో కొంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు.
ఈ రెండు ఘటనలు ఎర్రకోట(Red Fort) వంటి అత్యంత సున్నితమైన, భద్రత అవసరమైన ప్రదేశంలో నిఘా ఎంత బలహీనంగా ఉందో సూచిస్తున్నాయి. ఈ దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.