Sonam Wangchuk
లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీ ఇష్యూపై ఢిల్లీ వేదికగా సాగుతున్న పోరాటం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా కఠిన నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్(Sonam Wangchuk) దీక్షను హస్తిన పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు.
కేవలం సాల్ట్ వాటర్ను మాత్రమే తీసుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతున్న వాంగ్చుక్.. ఈ 20 రోజుల్లో సుమారు 9 కిలోల బరువు తగ్గారు. ఆయన బాడీలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ప్రమాదకరంగా పెరిగి, కండరాలు క్షీణించడం మొదలైందని నిన్ననే డాక్టర్లు హెచ్చరించారు. దీంతో ఆయన ప్రాణాలను కాపాడటానికి అత్యవసర చికిత్స అవసరమని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోనమ్ను.. బలవంతంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్కు తరలించగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.
అయితే వాంగ్చుక్ను తరలించినపుడు ,ఆ తర్వాత కూడా జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన స్థలాన్ని వెంటనే ఖాళీ చేయవలసిందిగా పోలీసులు ఆదేశించగా, దానికి నిరాకరించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధినేత అభిజిత్ దీప్కేతో పాటు కొంతమంది సామాజిక కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు గూండాల లాగా ప్రవర్తిస్తూ 60 ఏళ్ల వయసున్న సోనమ్ వాంగ్చుక్ను ఈడ్చుకెళ్లారని పోలీసుల తీరుపై అభిజిత్ దీప్కే మండిపడ్డారు. దేశం కోసం విదేశాల నుంచి తిరిగి వచ్చిన తనపై కూడా పోలీసులు దాడికి పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. వీరు శాంతిభద్రతలను కాపాడేవారు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ప్రస్తుతం జంతర్ మంతర్ పరిసరాల్లో ఘర్షణలు జరగకుండా ముందుగానే భారీ భద్రతా బలగాలను మోహరించారు.
అయితే, హాస్పిటల్కు తరలించడానికి ముందే సోనమ్ వాంగ్చుక్(Sonam Wangchuk) ఒక పవర్ఫుల్ వీడియోను విడుదల చేశారు. దేశంలో గతంలో ఉల్లిగడ్డల ధరలు పెరిగితేనే ప్రభుత్వాలు కూలిపోయాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనమవుతుంటే ఈ పాలకులు ఎందుకు రియాక్ట్ అవడం లేదని నిలదీశారు.జూలై 20వ తేదీన విద్యార్థుల హక్కుల కోసం నిర్వహించబోయే ఛలో పార్లమెంట్ మార్చ్లో.. దేశ ప్రజలంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది. శాంతియుతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నిరసన తెలుపుతున్న ఒకరి ప్రాణాలను కాపాడటం చట్టపరంగా సరైనదే అయినా.. ఒక సామాజిక కార్యకర్త 20 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విద్యార్థుల ఫ్యూచర్కు సంబంధించిన ఇలాంటి సున్నితమైన సమస్యపై కేంద్ర ప్రభుత్వం ముందే స్పందించి, నిరసనకారులకు నచ్చజెప్పి ఉండాల్సింది కదా అని కొంతమంది అంటున్నారు. అలా చేయకుండా బలవంతంగా దీక్షలను భగ్నం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
