Tulsi Plant
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు చాలా విశిష్టమైన స్థానముంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే తులసమ్మ పూజకు సంబంధించి పెద్దలు కొన్ని నియమాలను పెట్టారు.
ముఖ్యంగా సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్క (Tulsi Plant)కు నీరు పోయకూడదని పెద్దలు అంటారు. సాయంత్రం దాటాక కనీసం ఆ మొక్కను ముట్టుకోకూడదట. అయితే ఈ నియమం వెనుక కేవలం ఆధ్యాత్మిక నమ్మకాలే ఉన్నాయా లేక దీని వెనుక బలమైన వృక్ష శాస్త్ర (Botanical Science) రహస్యం ఉందా అనే విషయం చాలామందికి తెలీదు.
హిందూ పురాణాల ప్రకారం చూస్తే.. సూర్యాస్తమయం తర్వాత తులసమ్మ విశ్రాంతి తీసుకుంటుందని చెబుతారు. ఆ సమయంలో మొక్కను తాకడం, నీళ్లు పోయడం వల్ల తులసి నిద్రకు భంగం కలుగుతుందని అంటారు. ఇది ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గడానికి కారణమవుతుందట. అందుకే సాయంత్రం వేళ కేవలం తులసి కోట ముందు దీపం వెలిగించి నమస్కరిస్తారు తప్ప, తులసి మొక్కను అస్సలు ముట్టుకోరు.
అయితే మన పెద్దలు చెప్పిన ఈ నియమం వెనుక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. మొక్కలు పగటిపూట సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ (Photosynthesis) జరుపుకొంటూ కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చుకుని, ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కానీ రాత్రి సమయంలో ఈ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది.
రాత్రి వేళల్లో మొక్కలు కూడా మనుషులలాగే శ్వాసక్రియ (Respiration) జరుపుకొంటాయి. అంటే అవి ఆక్సిజన్ను తీసుకుని, కార్బన్ డై ఆక్సైడ్ను బయటకు వదులుతాయి. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క చుట్టూ కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మొక్క దగ్గరకు వెళ్లడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
సైన్స్ ప్రకారం చూస్తే.. రాత్రి పూట మొక్కల వేర్ల శ్వాసక్రియ రేటు కూడా మారుతుంది. సూర్యరశ్మి లేని సమయంలో మొక్కకు నీళ్లు పోస్తే, ఆ నీరు త్వరగా ఆవిరి అవ్వదు. పైగా రాత్రి పూట వెదర్ కూల్గా ఉండటం వల్ల కుండీలో , నేలలో నీరు ఎక్కువ సమయం అలాగే నిలిచిపోతుంది. దీనివల్ల తులసి మొక్క వేర్లకు ఆక్సిజన్ అందడం కష్టమవుతుంటుంది.
అంతేకాకుండా, ఎక్కువ తేమ వల్ల మొక్కల వేర్లకు ఫంగస్ సోకే ప్రమాదం ఉంది. అందులోనూ తులసి మొక్క(Tulsi Plant) చాలా సున్నితమైనది. ఆ వేర్లకు ఫంగస్ పడితే మొక్క కుళ్లిపోయి మెల్లగా ఎండిపోతుంది. అందుకే పగటిపూట మాత్రమే నీళ్లు పోయడం వల్ల సూర్యరశ్మికి అదనపు వాటర్ ఆవిరయిపోయి, వేర్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మన పూర్వీకులు సైన్స్ విషయాలను డైరెక్టుగా చెబితే పెద్దగా పట్టించుకోరని, వాటిని సంప్రదాయాలు, దైవభక్తితో ముడిపెట్టి చెప్పారు. తులసి మొక్క ఆరోగ్యంగా ఉంటేనే ఇంటికి శ్రేయస్సు అని చెబుతారు కాబట్టి.. దాన్ని కాపాడుకోవడానికి రాత్రి పూట నీళ్లు పోయకూడదనే నియమాన్ని పెద్దలు ప్రాచుర్యంలోకి తెచ్చారు.
