Mamata Banerjee
బెంగాల్ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) మింగుడుపడడం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లతో ఘనవిజయం సాధించింది. వచ్చే వారం ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అటు టీఎంసీ కీలక నేతలందరూ పరాజయం పాలయ్యారు.
పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సైతం భవానీపూర్ లో ఓడిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసిన దీదీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. రాజ్ భవన్ కు కూడా వెళ్లనని, ఏం చేస్తారో చేసుకోమంటూ సవాల్ విసిరారు.
బీజేపీ కుట్రపూరితంగా గెలిచిందని మమతా ఆరోపిస్తున్నారు. తమ గెలుపును బీజేపీ దొంగిలించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంతో కలిసి టీఎంసీ మద్ధతుదారుల ఓట్లను ఎస్ఐఆర్ విధానం పేరుతో అన్యాయంగా తొలగించిందని మండిపడ్డారు. మరో 100 సీట్లలో టీఎంసీనే గెలిచిందని, కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు, బీజేపీ నేతలు కుమ్మక్కై ఫలితాలు తారుమారు చేశారని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్నికల నిర్వహణ తీరుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్కుమార్పై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో జ్ఞానేష్కుమార్ ఒక విలన్లా వ్యవహరించారన్నారు. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా ఆయన వ్యవహరించారనీ ఆరోపించారు. తాము గెలిచిన 100 సీట్లను బీజేపీకి దోచిపెట్టారంటూ దీదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం ఏమాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్నారు.
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) పేరుతో భారీ కుంభకోణం జరిగిందని మమత ఆరోపించారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఇది బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు కాదనీ, బీజేపీ నేతలు, ఎన్నికల సంఘం కుమ్మక్కై దొంగిలించిన గెలుపుగా మమత అభివర్ణించారు. ఎన్నికలు జరిగిన తీరుపైనా ఎన్నో అనుమానాలున్నాయని మమత చెప్పారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉందని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
Coffee Butter :ముడతలు లేని ముఖం.. మృదువైన చర్మం.. కాఫీ బటర్ మ్యాజిక్
