Delimitation Bill
భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్రం తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బిల్లును కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరికొన్ని సమర్థిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఈ బిల్లు కారణంగా నష్టం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి వారు ఇప్పటికే పలుమార్లు గళం విప్పారు.
స్టాలిన్ అయితే ఈ బిల్లుకు సంబంధించి ప్రతులను తగలబెట్టారు. అయితే భిన్నాభిప్రాయాలు ఉన్నాసరే మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టిన కేంద్రం డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill )ను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇప్పటికే దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. చాలా మంది సభ్యులు లేవనెత్తిన అంశాలపై అమిత్ షా వివరణ కూడా ఇచ్చారు.
అదే సమయంలో పార్లమెంట్ ఆమోదం పొందితేనే బిల్లు చట్టంగా మారుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు పాసవుతుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఈ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో సంపూర్ణ మెజార్టీతో పాటు సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. ఎన్డీయేకు ఈ మెజారిటీ లేకపోవడంతో బిల్లు పాసవడంపై సస్సెన్స్ నెలకొంది. మూడింట రెండొంతుల స్థానాలను తీసుకుంటే 360 మంది అనుకూలంగా ఓటు వేయాలి. బీజేపీకి సొంతంగా ఉన్న బలం 294 మాత్రమే. దీంతో బిల్లు ఆమోదం పొందాలంటే మరో 66 మంది సభ్యుల ఓటు కావాలి.
తటస్థ సభ్యులను కూడా తమవైపు తిప్పుకున్నా ఎన్డీఏ బలం 306 మాత్రమే ఉంటుంది. మరో 60 ఓట్లు రావాలంటే క్రాస్ ఓటింగ్ జరగాల్సిందే. ఇండియా కూటమి సభ్యుల్లో ఎంతమందిని బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పిస్తుందనేది చూడాలి. గతంలో కొన్ని కీలక బిల్లులకు సంబంధించి ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతిచ్చినప్పటికీ డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా అనేది డౌటే.
ఒకవేళ ఇండియా కూటమి కఠినమైన విప్ జారీ చేసి బిల్లుకు వ్యతిరేకంగా 100 శాతం హాజరును చూపించగలిగితే మాత్రం ఎన్డీఏ కూటమికి షాక్ తప్పదు. అదే సమయంలో సభ్యులు గైర్హాజరు కావడం లేదా వాకౌట్ చేయడం లాంటివి చోటు చేసుకుంటే మాత్రం బీజేపీకి కలిసొస్తుంది. మొత్తం మీద డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill )ఆమోదం పొందాలంటే 60 ఓట్లు కీలకం కాబోతున్నాయి.
Voting: ఓటు వేయకపోవడం కూడా ఒక హక్కే.. సుప్రీం కోర్టు ఎందుకిలా తీర్పు ఇచ్చింది?
