Azim Premji : రోజుకు రూ.27 కోట్లు విరాళాలు.. అపర దానకర్ణుడు అజీమ్ ప్రేమ్ జీ గురించి తెలుసా?

Azim Premji : ప్రేమ్ జీ దాతృత్వం విలువ లక్ష కోట్లకు పైనే ఉంది. 2001లో అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన .. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

Azim Premji

వేల కోట్లు సంపాదించే పెద్ద వ్యాపారవేత్త రోజుకు కోటి రూపాయల వరకూ సామాజిక సేవకు కేటాయించొచ్చు. కానీ రోజుకు రూ.27 కోట్లు విరాళంగా ఇస్తే ఆయన కచ్చితంగా అపర దానకర్ణుడు కిందే లెక్క. అలాంటి వ్యక్తే విప్రో అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్ జీ.

ఏడాదికి దాదాపు 10 వేల కోట్లు సామాజిక సేవా కార్యక్రమాలకు దానం చేసే గొప్ప మనసున్న వ్యక్తిగా నిలిచిపోయారు. భారతీయ వ్యాపార రంగంలో ముఖ్యంగా ఐటీకి సంబంధించి అజీమ్ ప్రేమ్ జీ(Azim Premji) ప్రస్థానం అసాధారణమైనదిగా చెప్పాలి.

1945లో ముంబైలో జన్మించిన ప్రేమ్ జీ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. 21 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో కుటుంబ వ్యాపారాన్ని భుజానికెత్తుకున్న ప్రేమ్ జీ చమురు వ్యాపారం నుంచి మిగిలిన రంగాల్లోకి విస్తరించారు.

ఐటీ రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా విప్రో కంపెనీ రూపురేఖలనే మార్చేశారు. విప్రో సంస్థ సాఫ్ట్‌వేర్ రంగంలో భారతదేశానికి ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశంలో అతి కొద్దిమంది ఉదారస్వభావులైన వ్యాపారవేత్తల తరహాలోనే ప్రేమ్ జీ కూడా తన కంపెనీలో విలువలకే పెద్దపీట వేశారు. ఉద్యోగులను సొంత కుటుంబసభ్యుల్లా చూసుకున్నారు. ఆయన పాటించిన విలువలతో విప్రోను ప్రపంచంలోని అగ్రగామి సాఫ్ట్‌వేర్ సేవల సంస్థలలో ఒకటిగా నిలబెట్టారు.

ముఖ్యంగా 2000 సంవత్సరంలో విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా దేశంలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచింది. క్రమంగా దాని విలువ ఇన్ఫోసిస్ కంటే మూడు రెట్లు పెరిగింది. దీంతో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్ జీ వరుసగా ఐదేళ్ల పాటు అత్యుంత ధనవంతుడైన భారతీయుడిగా రికార్డులకెక్కారు.

Azim Premji

సంపాదనలో మాత్రమే కాదు దానాల్లోనూ ప్రేమ్ జీని మించిన వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన విరాళాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రోజుకు రూ.27 కోట్లు, ఏడాదికి రూ.9,250 కోట్ల పైనే సామాజిక సేవా కార్యక్రమాలకు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఇప్పటి వరకూ ప్రేమ్ జీ(Azim Premji) దాతృత్వం విలువ లక్ష కోట్లకు పైనే ఉంది. 2001లో అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన .. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మన దేశం నుంచి గివింగ్ ప్లెడ్జ్ పై సంతకం చేసిన తొలి వ్యక్తిగానూ నిలిచారు. వ్యాపార రంగంలోనూ, సామాజిక సేవారంగంలోనూ ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను ఇచ్చి గౌరవించింది.

Cortisol : అర్థరాత్రులు మెలకువ వస్తుందా? మీ బాడీని శాసిస్తున్న ఒక్క హార్మోన్ సీక్రెట్ అదే..

Exit mobile version