YS Sharmila
వైెఎస్ షర్మిల… వైెఎస్సార్ కుమార్తెగా ఏపీలో 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి.. జగన్ జైలులో ఉండగా పాదయాత్రను పూర్తి చేసి అఖండ విజయాన్ని అందించిన షర్మిలకు(YS Sharmila) తర్వాతి కాలంలో అన్నతో విభేదాలు మొదలయ్యాయి. రాజకీయపరంగానూ, ఆస్తుల పరంగానూ ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం వల్ల, తెలంగాణ లో వైఎస్సార్టీపీని స్థాపించడం జరిగింది.
తర్వాత పాదయాత్ర చేసి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వైఎస్సార్టీపీని విలీనం చేసే సమయంలో షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీటు హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీ నెరవేరే సమయం వచ్చినట్టు తెలుస్తోంది.
హఠాత్తుగా షర్మిలకు(YS Sharmila) హైకమాండ్ నుంచి పిలుపు రావడం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడం ఆసక్తికరంగా మారాయి. రాహుల్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన ఆమె ఈ భేటీకి సంబంధించి ట్వీట్ చేశారు. అయితే రాజ్యసభ సీటు కోసమే కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల భేటీ అవుతోందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.
ప్రస్తుతం కర్ణాటక నుంచి ముగ్గురు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. దీనిలో భాగంగా వైఎస్ షర్మిలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక లేదా ఢిల్లీ నుంచి.. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
రాజ్యసభ సీటు విషయంలో రాహుల్ గాంధీ నుంచి కూడా షర్మిల హామీ పొందినట్టు అర్థమవుతోంది. అదే సమయంలో ఏపీకి సంబంధించి షర్మిలకు పెద్ద టాస్క్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం తెచ్చే దిశగా హైకమాండ్ ప్రణాళికలు రచిస్తోందనీ, పార్టీలో విభేదాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆమెకు సూచించినట్టు సమాచారం.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కంటే తన అన్న జగన్ నే షర్మిల టార్గెట్ చేసారన్న విమర్శలు వినిపించాయి. అయితే ఇకపై పార్టీకి లబ్ది చేకూరేలా కార్యక్రమాలు ఉండాలని రాహుల్ షర్మిలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేసినట్టు కూడా అర్థమవుతోంది.
