Siddaramaiah
కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు సంచలన పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన లీడర్షిప్ సస్పెన్స్కు తెరదించేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తన పదవికి రిజైన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
బెంగళూరులోని తన అధికారిక నివాసంలో మంత్రివర్గ సహచరుల కోసం ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో సిద్ధరామయ్య(Siddaramaiah) ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను గౌరవించి, పార్టీ క్రమశిక్షణ కలిగిన లీడర్గా తాను ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ ప్రత్యేక సమావేశంలో ఒక ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. సిద్ధరామయ్య రిజైన్ చేసినట్లు ప్రకటన చేయగానే.. కర్ణాటక తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
సిద్ధరామయ్య (Siddaramaiah) కూడా ఎంతో హుందాగా డీకేను గుండెలకు హత్తుకుని, ఆశీస్సులు అందిస్తూ కర్ణాటక అధికార మార్పిడికి పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే తమకు ఇప్పటివరకూ సహకరించిన మంత్రివర్గానికి కృతజ్ఞతలు చెప్పడానికి ..సీఎం విందు ఏర్పాటు చేశారని మంత్రి పరమేశ్వర మీడియాకు తెలిపారు.
మరోవైపు, ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇండోర్ పర్యటనలో ఉండటంతో.. రాజకీయ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని అనుకున్న సిద్ధరామయ్య.. గవర్నర్ అందుబాటులో లేకపోయినా ఆయన కార్యదర్శికి లేదా రాజ్భవన్లో తన రాజీనామా పత్రాన్ని అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం రాజీనామా అఫీషియల్గా ఆమోదం పొందాలంటే ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ను కలవాల్సి ఉంటుంది.
