Puri Jagannath Rath Yatra
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. పూరీ జగన్నాథుని రథయాత్రలో(Puri Jagannath Rath Yatra) ఇవాళ తొక్కిసలాట జరిగి.. ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది గాయపడ్డారు. ఎప్పటిలానే ఈసారి కూడా యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
పోలీసులు, దేవస్థాన సిబ్బంది, ఇతర వాలంటీర్లతో కలిపి భారీ ఏర్పాట్లు చేసినా సరే ఊహించని రద్దీతో తొక్కిసలాట జరిగింది. దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు యాత్రకు తరలివచ్చినట్టు అంచనా. రథయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.
భక్తులు రథం వైపు దూసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా వారంతా ముందుకు వచ్చేయడంతో తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఒక భక్తుడు ఊపిరాడక మృతి చెందినట్టు గుర్తించారు. అలాగే ఊపిరాడక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న సుమారు 120 మంది భక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘటన ప్రధానంగా ఆలయ ప్రాంతం వైపు వెళ్లే గ్రాండ్ రోడ్లో జరిగింది. అత్యవసర ప్రత్యేక రెస్క్యూ యూనిట్ బృందాలతో పాటు ఆ మార్గం వెంట మోహరించిన వైద్య సిబ్బంది వెంటనే వైద్య సహాయం అందించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
గతేడాది జూన్ 29న జరిగిన రథయాత్రలో కూడా పెద్ద తొక్కిసలాట జరిగింది. ఆ సంఘటనలో, జనసమూహం పెరగడంతో ముగ్గురు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ సారి పకడ్బందీ ఏర్పాట్లు చేసినా తొక్కిసలాట జరగడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 20 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.
ఘటన జరిగిన కొన్ని నిమిషాలలోనే సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం ఎక్కువగా లేకుండా బయటపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. 12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథుని ఆలయంలో ఏటా జరిగే ఈ రథయాత్రను వీక్షించడానికి దేశవిదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ విపరీతమై రద్దీ కారణంగానే మరోసారి తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి.
IRCTC : రైలు టికెట్ బుకింగ్ ఇక సూపర్ఫాస్ట్..క్యాప్చాలు, పాపప్ల గోల ఉండదు..
