BCCI
ప్రస్తుతం టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో బిజీగా ఉంది. ఇది ముగిసిన మూడు వారాలకు ఐపీఎల్ హడావుడి మొదలవుతుంది. మే నెలాఖరు వరకూ ఐపీఎల్ జరగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు అంతర్జాతీయ సిరీస్ లతో బిజీ కానుంది. దీనిలో భాగంగా జూన్ నెలలో ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ(BCCI) ధ్రువీకరించింది.
ఈ టూర్ లో ఆప్ఘనిస్థాన్ భారత్ తో ఒక టెస్ట్, మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది.. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ(BCCI) రిలీజ్ చేసింది. ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు న్యూ చంఢీగడ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. జూన్ 14 తొలి వన్డే ధర్మశాలలోనూ, రెండో వన్డే 17న లక్నోలోనూ, చివరి వన్డే 20వ తేదీన చెన్నైలోనూ జరుగుతాయి.
భారత్, ఆప్ఘనిస్థాన్ జట్లు 2018లో ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లో మళ్ళీ ఈ రెండు జట్లు తలపడలేదు. ఆప్ఘనిస్థాన్ కు టెస్ట్ హోదా వచ్చిన తర్వాత పలు పెద్ద దేశాలతో అప్పుడప్పుడు ఏకైక టెస్ట్ మ్యాచ్ లు ఆడుతోంది. అలాగే భారత్.. ఆఫ్ఘానిస్తాన్ చివరిసారిగా 2024లో టీ20 సిరీస్ లో తలపడ్డాయి.
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పూర్తిస్థాయిలో రెండు దేశాల ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ద్వారా భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీతో కనిపించనున్నారు. టెస్ట్, టీ20లకు గుడ్ బై చెప్పిన వీరిద్దరూ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోకో జోడీ ఈ మధ్య కాలంలో జరిగే దాదాపు అన్ని సిరీస్ల(BCCI) లోనూ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
