FIFA World Cup
సాకర్ ప్రపంచకప్ విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, స్పెయిన్ తలపడబోతున్నాయి. అయితే ఈసారి ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టుకు అరుదైన గౌరవం దక్కనుంది.
ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచిన జట్టు ప్లేయర్స్కు ప్రత్యేకమైన బహుమతి లభించనుంది. ఫైనల్లో విజయం సాధించిన జట్టుకు ట్రోఫీ, గోల్డ్ మెడల్స్తో పాటు ప్రత్యేకమైన ఛాంపియన్ షిప్ రింగ్స్ అందజేయనున్నట్లు ఫిఫా అధికారికంగా ప్రకటన చేసింది.
అమెరికా క్రీడల్లో ఇది సహజంగా కనిపిస్తుంటుంది. కానీ తొలిసారి అంతర్జాతీయ ఫుట్ బాల్లో ప్రవేశపెడుతున్నారు. ట్రోఫీని అందజేసే వేదికపైనే విన్నింగ్ టీమ్ కోచ్, కెప్టెన్తో పాటు ఆటగాళ్లందరికీ ఈ రింగ్స్ బహూకరించనున్నారు. ఈ రింగ్స్ను ఫిఫా అత్యంత ప్రత్యేకంగా తయారు చేయించింది.
ప్రతీ ఉంగరంపై వరల్డ్ కప్ ట్రోఫీ చిత్రం, విజేతగా నిలిచిన జట్టు ప్రాతినిథ్యం కనిపించేలా ప్రత్యేక డిజైన్ ఉంటుంది. అలాగే ప్రతీ రింగ్కు ఒక ప్రత్యేక నెంబర్, ప్రామాణికతను ధృవీకరించే సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు.
కాగా ఫిఫా ప్రపంచకప్(FIFA World Cup) ప్రస్తుత ఎడిషన్ గుర్తుండేలా మొత్తం 2026 రింగ్స్ మాత్రమే తయారు చేయించారు. వీటిలో 30 ఉంగరాలను ట్రోఫీ గెలిచిన జట్టుకు బహూకరించనుండగా.. మిగిలిన 1996 ఉంగరాలను అభిమానులకు విక్రయించనున్నారు.
ఈ ఉంగరాలను అధికారిక లైసెన్స్డ్ ఉత్పత్తులుగా ఫిఫా వెబ్ సైట్లో ఉంచి విక్రయించనున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్ నెలకొనడం ఖాయం. ఇప్పటికే సాకర్ ఫ్యాన్స్ వీటి కోసం ఆరా తీస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ ముగిసి, విజేత జట్టుకు అందజేసిన తర్వాతే వీటిని అభిమానుల కోసం ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
ఇదిలా ఉంటే ఆదివారం అర్థరాత్రి జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరప్ ఛాంపియన్ స్పెయిన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. మెస్సీ మ్యాజిక్తో వరుసగా రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనా మరోసారి టైటిల్పై కన్నేసింది.
Sonam Wangchuk : చనిపోయినా దెయ్యంగానైనా తిరిగొస్తా..సోనమ్ వాంగ్చుక్ వ్యాఖ్యలు వారిని కదిలిస్తాయా?
