Gambhir
శ్రీలంకతో తొలి టెస్టుకు భారత తుది జట్టు కూర్పు సవాల్గా మారింది. మూడో స్థానంలో ఎవరు ఆడబోతున్నారు? నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమేనా? ఇద్దరే పేసర్లను తీసుకుంటే ఎవరిని బెంచ్కు పరిమితం చేస్తారు. ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి.
అటు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ వీటిపైనే తర్జన భర్జన పడుతున్నారు.ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. పైగా వార్మప్ మ్యాచ్ లో అతను సెంచరీ బాది ఫామ్ కూడా నిరూపించుకున్నాడు.
అయితే సర్ఫరాజ్ ఖాన్ను తుది జట్టులోకి తీసుకుంటే ఏ స్థానంలో ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాలుగో స్ధానంలో గిల్, ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా ఆడబోతున్నారు. ఏడవ స్థానంపై మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది.
శ్రీలంక టూర్లో భారత జట్టులో ధ్రువ్ జురెల్ మరొక స్పెషలిస్ట్ వికెట్ కీపర్-బ్యాటర్గా ఉన్నాడు. అలాగే సారాన్ష్ సుబోధ్ జైన్ ఆల్ రౌండర్గా అందుబాటులో ఉన్నాడు. సారాన్ష్ స్పిన్-బౌలింగ్ ఆల్-రౌండర్, బ్యాటింగ్ కూడా చేస్తాడు. గాలే పిచ్ సాంప్రదాయకంగా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది.
దీంతోనే టీమిండియా మేనేజ్మెంట్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు యువ స్పిన్నర్లు మానవ్ సుతార్, సారాన్ష్ జైన్లలో ఒకరికి లేదా ఇద్దరికీ తుది జట్టులో అవకాశం దక్కొచ్చు.
టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనినే బలపరుస్తున్నాయి. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు. అయితే ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఒకేసారి ఆడించడం టీమిండియాకు పెద్ద సమస్య కాదన్నాడు. వీరి బౌలింగ్లో వైవిధ్యం ఉండటంతో.. గిల్ వారిని ఎలా ఉపయోగిస్తాడనేదే ముఖ్యమనీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా గాలె టెస్టులో టీమిండియా పూర్తిగా స్పిన్ బలాన్నే నమ్ముకుని బరిలోకి దిగబోతోంది.
