Konda Surekha
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. కేబినెట్ నుంచి తనను తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు ఎవరైనా సరే.. కనీసం కారణం ఏంటో అడిగి, ఎక్స్ప్లనేషన్ తీసుకునే ఛాన్స్ ఇస్తారు.. కానీ తన విషయంలో అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా డైరెక్ట్గా పక్కన పెట్టేయడం ఏంటని ప్రశ్నించారు. అసలు తన కూతురు ఎక్కడో ఏదో మాట్లాడితే.. దానికి తనను బాధ్యురాలిని చేస్తూ శిక్షించడం ఏ రకమైన న్యాయమని సూటిగా ప్రశ్నించారు.
బర్తరఫ్ వరకు విషయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరమే లేదన్న సురేఖ.. ఒక్క మాట చెప్పి రాజీనామా చేయి అంటే తన చేతులతోనే రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేదాన్నంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆత్మ గౌరవం కోసం తాను పదవులను వదులుకున్న చరిత్ర ఉందని, మంత్రి పదవి తనకు కేవలం ఒక ఆభరణం వంటిది మాత్రమేనని అన్నారు.
తానెప్పుడూ పార్టీ గైడ్ లైన్స్ దాటలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని కొండా సురేఖ వివరించారు. గతంలో కాంగ్రెస్ నాయకులు అధిష్టానంపై, హైకమాండ్ నేతలపైన కూడా ఓపెన్గా కామెంట్లు చేసినా పెద్దగా పట్టించుకోని హస్తం పార్టీ.. తన విషయంలో మాత్రం ఈ విధంగా, ఇంత సీరియస్గా ఎందుకు యాక్షన్ తీసుకుందో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
పార్టీలో వేరే నేతలు కాంట్రవర్సీ కామెంట్లు చేసినప్పుడు లేని పట్టింపులు.. తన విషయంలోనే ఎందుకు వచ్చాయని సురేఖ ప్రశ్నించారు. అసలు కేబినెట్లోని మంత్రులు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నారా అని వారంతా గుండెపై చేయి వేసుకుని చెప్పాలని సవాల్ విసిరారు.
కేబినెట్ లోపల జరుగుతుంది వేరని పాయింట్ అవుట్ చేసిన కొండా సురేఖ..ఆ మంత్రులంతా బయటకొచ్చి నిజాలు మాట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో జనాలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలీక అయోమయంలో ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను సరైన విధానంలో అమలు చేస్తేనే హస్తం పార్టీ మళ్లీ పబ్లిక్ సపోర్ట్ సాధిస్తుందని..దానికోసం వెంటనే కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే ఏకపక్షంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసేసుకోకుండా, సీనియర్లతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు ఉండాలని సురేఖ అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా.. లేకపోయినా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు మాత్రం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని చెప్పారు. భవిష్యత్ రాజకీయాల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, తన చేతిలో ఇంకా ఎలాంటి ప్లాన్-బీ సిద్ధంగా లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కొండా సురేఖ ఎమోషనల్ అయ్యారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత తాను ఆ రేంజ్లో గౌరవం ఇచ్చి అభిమానించిన నాయకుడు రేవంత్ రెడ్డేనని చెప్పారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అవ్వాలని, ముఖ్యమంత్రిగా ఎదగాలని అందరికంటే ముందు కోరుకుంది తానేనని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి తనపై కక్ష సాధింపు ధోరణితో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు.
పార్టీలో ఉన్న ముగ్గురు బీసీ మహిళలకు తగిన గుర్తింపుతో పాటు పదవులు దక్కడం తనకు ఎంతో చాలా సంతోషంగా ఉందని సురేఖ అన్నారు. అయితే చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకుడిపై యాక్షన్ తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. చివరగా కాంగ్రెస్ అధిష్టానానికి తాను రాసిన లేఖను మీడియా ముందు చూపించిన సురేఖ .. తన నెక్స్ట్ పొలిటికల్ మూవ్ ఏంటి, ఏ దిశగా అడుగులు పడతాయో కాలమే ఆన్సర్ చెబుతుందని సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ క్లోజ్ చేశారు.
