Pawan Kalyan
ఏపీ ఉపముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా ఎంత బిజీగా ఉన్నా, తనను ప్రాణంగా ప్రేమించే ఒక సామాన్యుడు ప్రాణాంతక పరిస్థితిలో ఉన్నాడని తెలియగానే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరుగున వచ్చారు. హనుమకొండలోని హనుమాన్నగర్లో నివసిస్తున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ను చూడటానికి వెళ్లిన పవన్ .. అక్కడ చూపించిన ఆప్యాయత ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది.
నిరంజన్ మూడేళ్లుగా డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన, జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ భయంకరమైన వ్యాధి వల్ల రోజురోజుకూ అతని శరీరం క్షీణించి, ప్రస్తుతం పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. స్థానికంగా చోటా గబ్బర్ సింగ్ అని పిలవబడే నిరంజన్కు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఎప్పుడూ పవన్ నామస్మరణ చేస్తూ, తన జీవితంలో ఒక్కసారైనా తనను చూడాలని కలలు కనేవాడు.
మూడేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతూ చిన్న పిల్లాడుగా కనిపిస్తూ మంచానికే పరిమితమయిన నిరంజన్ గురించి జనసేన నాయకులు , సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ … పవన్(Pawan Kalyan) దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన పవన్ పనిగట్టుకుని బుధవారం హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి సుమారు 45 నిమిషాల పాటు ఆ కుటుంబంతో గడిపారు.
నిరంజన్ను చూడగానే ఎంతో ఆవేదనకు గురయిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ..దగ్గరకు వెళ్లి ఎంతో ప్రేమగా తల నిమురుతూ ధైర్యం చెప్పారు. నిరంజన్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడిన ఆ క్షణం అక్కడ ఉన్నవారందరినీ కరిగించింది. నిరంజన్ తల్లిదండ్రులైన రాము, మానసలను అడిగి అతని ఆరోగ్య పరిస్థితిని, పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
తర్వాత వారి కుటుంబంతో కలిసి ఫోటోలు దిగి, వారికి కొండంత మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. పవన్ రాక విషయం తెలుసుకుని ఆయనను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది.
CM Vijay : తమిళనాడులో సీఎం విజయ్ మార్క్ పాలిటిక్స్.. దళపతి పాలన ఎలా ఉంది?
