Section 22-A
ఎప్పుడో సొంతంగా కాస్త స్థలమో, ఫ్లాటో కొనుక్కుని మనకంటూ చిన్న ఆస్తి ఉందని కొండంత ధైర్యంతో ఉన్న సామాన్య, మధ్యతరగతి వారికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అవసరం మీద ఇల్లు అమ్మాలన్నా చివరకు పిల్లల పెళ్లిళ్లు, ఎడ్యుకేషన్ కోసం బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుందామన్నా కూడా ..మీ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానే కాదు, బ్యాంక్ లోన్ రాదంటూ ఆఫీసర్లు బాంబు పేల్చుతున్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ప్రస్తుతం అనుభవిస్తున్న నరకం ఇది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, డేటా అప్డేషన్లో చేసిన బ్లండర్ మిస్టేక్స్ వల్లే ఈ తలనొప్పి మొదలైందని తేలడంతో.. సర్కార్ దిగొచ్చి క్షమాపణలు చెప్పడమే కాకుండా..చివరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది.
భారత దేశంలో ఉండే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 లోని సెక్షన్ 22ఏ(Section 22-A) ప్రకారం చూస్తే ప్రభుత్వానికి చెందిన ఏవైనా ల్యాండ్స్, దేవాదాయ అండ్ వక్ఫ్ భూములు, అసైన్డ్, భూదాన భూములతో పాటు, కోర్టు వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులను భూ యజమానులుగా చెప్పుకుంటున్నవారు, ఇతరులు అక్రమంగా అమ్మకుండా, బదిలీ చేయకుండా బ్లాక్ చేసే పవర్ ఏ ప్రభుత్వానికి అయినా ఉంటుంది.
ఇదంతా బాగానే ఉంది కానీ, తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పాత ధరణి పోర్టల్ ప్లేస్లో.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూ భారతి విధానాన్ని అమలుల్లోకి తెచ్చే ప్రాసెస్ ప్రారంభించింది. దీనిలో భాగంగా 2026 ఏప్రిల్లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల డేటాను అప్డేట్ చేసింది.
భూ భారతి పోర్టల్ మైగ్రేషన్ అలాగే ఈ రికార్డుల డిజిటైజేషన్ సమయంలో అధికారుల అలసత్వం బయటపడింది. గ్రౌండ్ లెవెల్కు వెళ్లకుండా, కనీసం మైండ్ కూడా వాడకుండా ఒకే సర్వే నెంబర్లో కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే.. ఆ సర్వే నెంబర్ కింద ఉన్న వేలాది ఎకరాల ప్రైవేట్ పట్టా భూములను, కాలనీలను కూడా బ్లైండ్గా సెక్షన్ 22ఏ బ్యాన్ లిస్ట్లో పడేసి ఆఫీసులకు సర్క్యులర్ పంపారు.
ఇలా అధికారుల నిర్వాకం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. కోట్లు విలువ చేసే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి వీఐపీ ఏరియాల నుంచి స్టార్ట్ అయి, దశాబ్దాల క్రితం హుడా (HUDA), హెచ్ఎండీఏ (HMDA) పక్కా అప్రూవల్స్తో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు కూడా రాత్రికి రాత్రే సర్కార్ వారి బ్లాక్ లిస్ట్లోకి వెళ్లిపోయాయి.
తాజాగా ఇల్లు, ప్లాట్ కొనుక్కున్న వాళ్లు, అవసరాల కోసం తమ ఆస్తిని అమ్మాలనుకున్నవాళ్లు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని ప్రాపర్టీ పేపర్లు పట్టుకుని రిజిస్ట్రార్ ఆఫీసు మెట్లు ఎక్కినప్పుడు గానీ ..తమ ఆస్తి ల్యాండ్ లాక్ అయిందన్న సంగతి అర్థం కావడం లేదు. దీంతో బాధితులంతా కేసులు పెట్టడానికి క్యూ కట్టడంతో ఇప్పటికే దాదాపు 6,000కు పైగా కేసులు హైకోర్టు గడప తొక్కాయి.
విషయం చేతులు దాటిపోతుందన్న వాస్తవం గ్రహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రెస్పాండ్ అయ్యారు. అధికారుల ఓవరాక్షన్, టెక్నికల్ లోపాల వల్లే ఇలా జరిగిందని ఒప్పుకుంటూ, ఇబ్బంది పడ్డ ఆస్తి యజమానులకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఈ సమస్యను వార్ ఫుటింగ్లో సాల్వ్ చేయడానికి ఒక హై-లెవల్ కమిటీని సెటప్ చేయడంతో పాటు, బాధితుల కోసం 1800-599-4788 అనే టోల్-ఫ్రీ నెంబర్ను లాంచ్ చేశారు. ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
మరోవైపు ఇదే ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అర్ధరాత్రి హై-లెవల్ సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్లాట్ బుక్ చేసుకున్న ఆస్తుల రికార్డులను కేవలం 2 రోజుల్లోనే క్రాస్ చెక్ చేసి, అవి ప్రైవేట్ ప్రాపర్టీస్ అని తేలితే వెంటనే వాటికి రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయాలని స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు.
ఒక్క అంగుళం ప్రైవేట్ ల్యాండ్కి కూడా నష్టం జరగడానికి వీల్లేదని చెబుతూనే మరోవైపు దీనికోసం దళారుల వద్దకు వెళ్లి మోసపోవద్దని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి అల్టిమేటమ్తో రంగంలోకి దిగిన ఆఫీసర్లు మేడ్చల్-మల్కాజ్గిరిలో 30, రంగారెడ్డిలో 4 పెండింగ్ రిజిస్ట్రేషన్లను గంటల వ్యవధిలోనే క్లియర్ చేశారు.
ఇటు అధికారుల మీద తప్పంతా నెట్టేసి మంత్రి తప్పుకోవడానికి వీల్లేదని,దీనికి బాధ్యత వహిస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు సెక్షన్ 22ఏ కింద చేర్చిన అన్ని ప్రాపర్టీల వివరాలపై వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
బ్లాక్ లిస్ట్ నుంచి పేర్లు తొలగించడానికి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అధికారులు భారీగా కమీషన్లు నొక్కుతున్నారని ఆరోపించిన బీఆర్ఎస్ పార్టీ.. బాధితులకు ఫ్రీగా లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి తెలంగాణ భవన్లో లీగల్ ఎయిడ్ సెల్ను స్టార్ట్ చేసింది. ఇటు బీజేపీ లీడర్లు కూడా రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.
అయితే, తాము కావాలని ఏ ఒక్క ప్రైవేట్ ఆస్తిని బ్లాక్ చేయలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి పొరపాట్లను ప్రక్షాళన చేసే విధానంలోనే ఈ చిన్న టెక్నికల్ గ్యాప్ వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. ప్రజలు తమ ఆస్తుల స్టేటస్ను అఫీషియల్ వెబ్సైట్లలో వెరిఫై చేసుకోవాలని సూచిస్తున్నాయి.
