Vijayasai Reddy
కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో చెలరేగిన ఊహాగానాలు, పొలిటికల్ సస్పెన్స్కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. వైఎస్సార్సీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారంటూ సోషల్ మీడియాలో వరుసగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పొలిటికల్ ఫ్యూచర్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ సాయి రెడ్డి(Vijayasai Reddy).. మీడియాతో మాట్లాడుతూ తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తన కొత్త ప్రయాణానికి, తమ పార్టీకి స్వామివారి ఆశీస్సులు కోరానని ఆయన తెలిపారు.
ఏపీ పొలిటికల్ తెరపై ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలనే కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి వివరించారు. ప్రజల తరఫున అసలైన గొంతుకగా నిలబడాలనేది తన మెయిన్ ఎజెండా అని చెప్పిన ఆయన.. పార్టీ పేరు,జెండా, భవిష్యత్ రోడ్మ్యాప్తో పాటు పూర్తి వివరాలను ఈ నెలలోనే విజయవాడలో మీడియా సమావేశం పెట్టి అఫీషియల్గా ప్రకటిస్తానని చెప్పారు.
తన రాజ్యసభ ఎంపీ పదవితో పాటు గతేడాది వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి.. ఇకపై రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించారు. అయితే కొద్ది కాలంలోనే తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తానని, ఒక సొంత మీడియా సంస్థను కూడా స్టార్ట్ చేస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆరోజు నుంచి ఎక్స్ (ట్విట్టర్), సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్న విజయసాయి రెడ్డి(Vijayasai Reddy).. జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలను పంచుకుంటూ వస్తున్నారు. దీంతోనే ఆయన మళ్లీ వైసీపీ గూటికి చేరతారనే వార్తలు జోరందుకున్నాయి.
ఈ వార్తలకు చెక్ పెడుతూ.. తనది ఇండిపెండెంట్ ఐడియాలజీ అని, ఎవరి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదని, కేవలం ఏపీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయని ఇప్పటికే ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. అలాంటి సమయంలోనే భారత్ జన వికాస్ అనే పేరుతో సాయి రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది.
మొత్తానికి తాజాగా తిరుమల సన్నిధిలో విజయ సాయి(Vijayasai Reddy) రెడ్డి చేసిన ఈ అధికారిక ప్రకటనతో అన్ని ఊహాగానాలనాలకు ఫుల్ స్టాప్ పడి, త్వరలోనే సొంత జెండాతో ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు తేలిపోయింది.
