Telegram Founder
టెలిగ్రామ్… ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో అందరికీ తెలుసు. అత్యంత వేగంగా మెసేజెస్ పంపించడానికి ఉపయోగపడే సోషల్ నెట్వర్కింగ్ యాప్. 2013లో రష్యాకు చెందిన పావెల్ దురోవ్, నికోలాయ్ దురోవ్ దీనిని ప్రారంభించారు.
ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో, అత్యధికంగా డౌన్లోడ్ చేయబడే టాప్ 5 యాప్లలో ఒకటిగా నిలిచింది. అయితే కొంతకాలంగా టెలిగ్రామ్ యాప్ వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యంగా డార్క్ నెట్వర్క్, ఉగ్రవాదులు , బెట్టింగ్ ఇంకా చాలా అసాంఘిక కార్యాకలాపాలకు ఇది వేదికగా మారిందని చెబుతున్నారు.
దీనిపై ఇప్పటికే చాలా దేశాల్లో టెలిగ్రామ్కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. రష్యా , ఫ్రాన్స్ వంటి దేశాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం, ప్లాట్ఫారమ్ను సరిగ్గా నియంత్రించకపోవడం వంటి అంశాల్లో టెలిగ్రామ్ ఫౌండర్(Telegram Founder) పావెల్ దురోవ్పై ఆరోపణలు గుప్పించాయి.
తాజాగా రష్యా పావెల్ దురోవ్ను మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. టెలిగ్రామ్ యాప్ను ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు దాడుల సమన్వయం కోసం ఉపయోగిస్తున్నాయని, వాటిని తొలగించడంలో దురోవ్ విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
ఫ్రాన్స్లో ఆయనపై వచ్చిన ఆరోపణల ప్రకారం, టెలిగ్రామ్లో చట్టవిరుద్ధమైన లావాదేవీలు, మాదకద్రవ్యాల రవాణా, పిల్లల సెక్సువల్ కంటెంట్ వంటి తీవ్ర నేరాలను అరికట్టడంలో యాప్ యాజమాన్యం విఫలమైందని అక్కడి భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వకుండా, ఎన్క్రిప్షన్ పేరుతో నేరస్థులకు ప్లాట్ఫారమ్ దుర్వినియోగం అయ్యేలా చేశారనే వాదనలు ఉన్నాయి. పావెల్ దురోవ్ మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేయడానికి రష్యా తప్పుడు కేసులు పెడుతోందని గతంలోనే ఆయన ఆరోపించారు.
కాగా ప్రస్తుతం ఈ కేసులను విచారించేటపుడు లభించిన ఆధారాలతోనే మోస్ట్ వాంటెడ్ జాబితాలో పావెల్ దురోవ్ను చేర్చినట్టు రష్యా ప్రకటించింది. 2024 ఆగస్టులో ఫ్రాన్స్ ప్రభుత్వం ఇవే ఆరోపణలపై దురోవ్ను పారిస్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి, ఆ తర్వాత బెయిల్పై విడుదల చేసింది. అయితే టెలిగ్రామ్ యాప్పై మూడేళ్లుగా తీవ్రమైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
ఈ యాప్లోని ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానంతో సందేశాలను మూడో వ్యక్తి లేదా దర్యాప్తు సంస్థలు హ్యాక్ చేయడం లేదా గుర్తించడం అసాధ్యంగా మారుతోంది. టెలిగ్రామ్లో ఒకేసారి లక్షలాది మంది సబ్స్క్రైబర్లతో ఛానెళ్లను నడపొచ్చు. ఒకరికొకరు పరిచయం లేకపోయినా తీవ్రవాద భావజాలాన్ని, ప్రచార వీడియోలను చాలా ఈజీగా వ్యాప్తి చేయడానికి ఇది వీలు కల్పిస్తోంది.
వినియోగదారులు తమ ఫోన్ నెంబర్లు, గుర్తింపు వివరాలను దాచిపెట్టే సదుపాయం ఉండటం వల్ల అకౌంట్ల వెనుక ఉన్న అసలు నేరగాళ్లను పట్టుకోవడం కష్టతరంగా మారుతోంది. అయితే ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పెరగడంతో, టెలిగ్రామ్ యాజమాన్యం(Telegram Founder) తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రకటిస్తూ వస్తోంది.
గడిచిన కాలంలో అంతర్జాతీయ భద్రతా సంస్థలతో కలిసి మిలియన్ల కొద్దీ ఉగ్రవాద సంస్థల అకౌంట్లను, ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు సంస్థ పేర్కొంది. చట్టపరమైన అభ్యర్థనలు వస్తే నిబంధనల ప్రకారం యూజర్ల ఐపీ అడ్రస్లు, ఫోన్ నెంబర్లను అధికారులకు అందజేస్తామని హామీ ఇచ్చింది.
