Renu Desai
సెలబ్రెటీలను ఏమన్నా పర్వాలేదన్న ధోరణి రోజురోజుకు పెరిగిపోతుంది. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మరీ బూతులతో , సంస్కార హీనంగా దిగజారుడు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు తమకు నచ్చని వారయితే మరీ టార్గెట్ చేస్తున్నట్లు బిహేవ్ చేస్తుంటారు. అయితే సహనానికి కూడా హద్దు ఉంటుంది. అలా తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర మాటల దాడులపై రేణు దేశాయ్(Renu Desai) యుద్ధం ప్రకటించారు. కొన్నాళ్లుగా తనపై వస్తున్న విమర్శలను భరిస్తూ వచ్చిన ఆమె, ఇప్పుడు ఆ సహనాన్ని వీడి చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
ఇటీవల స్వచ్ఛంద సంస్థల తరపున ఓ ప్రెస్మీట్కు హాజరయిన రేణు దేశాయ్.. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడారు. అయితే దాని తర్వాత, నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ కుక్కలు నిన్ను కరిస్తే తెలుస్తుంద్న కామెంట్లే కాదు , అసభ్యకరమైన పదజాలంతో, భూతులతో ఆమెను టార్గెట్ చేశారు.
సెలబ్రెటీలను ఏమన్నా పర్వాలేదు, వారిని ఎలా దూషించినా చెల్లుతుందనే ఒక వికృతమైన మానసిక స్థితి నెటిజన్లలో పెరిగిపోతుంది. ముఖం కనిపించదు కదా అని ఒక మనిషి వ్యక్తిగత జీవితంపై దాడి చేసే హక్కు, అవతలి వాళ్లను నోటికొచ్చినట్లు అనే అధికారం వీరికి అసలు ఎవరిచ్చారనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నారు.
రెండు రోజుల క్రితమే ఒక వీడియో ద్వారా తన ఆవేదనను పంచుకున్న రేణు.. తన వ్యక్తిగత జీవితంపై , విడాకుల వ్యవహారంపై ఏళ్ల తరబడి వస్తున్న నెగిటివ్ కామెంట్లను భరిస్తూనే ఉన్నానని అన్నారు. అయితే ఇటీవల డాగ్స్ కోసం నిర్వహించిన ప్రెస్ మీట్ తర్వాత, కొంతమంది తన పర్సనల్ లైఫ్ను టార్గెట్ చేస్తూ మాట్లాడలేని పదాలతో తిడుతున్నారని బాధపడ్డారు. చివరకు తాను కాశీ వెళ్లినా కూడా వదల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సెలబ్రిటీలన్నాక విమర్శలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే ఆ విమర్శలు హద్దులు దాటి నీచమైన బూతు పురాణంగా మారడమే ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియా అంటే ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ.. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం కాదని, అక్కడ కూడా ఒక బాధ్యత ఉంటుందని వీళ్లు మర్చిపోతున్నారు. ఇదే విషయాన్ని రేణు దేశాయ్ ఇటీవల గుర్తు చేశారు. ఇలాంటి పద్ధతిని ఇకపై తను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
ఆ వార్నింగ్ను నిజం చేస్తూ తాజాగా రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లి అధికారికంగా కంప్లైంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తన పోస్టుల కింద అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మొన్నటికి మొన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్, ఈరోజు డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
