Mojtaba
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుటుంబసభ్యులు మరణించారు. యుద్ధ పరిస్థితుల కారణంగా నాలుగు నెలల తర్వాత ఈ అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇరాన్ను పాలించిన అలీ ఖమేనీ అంత్యక్రియలు జాతీయ ఐక్యతను ప్రదర్శించడానికి, ప్రభుత్వ బలాన్ని చాటుకోవడానికి, యుద్ధం తర్వాత ప్రజలను ఏకం చేయడానికి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని రాజధాని టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా మసీదులో ప్రజల సందర్శన కోసం ఉంచారు. లక్షలాది మంది ప్రజలు ఆయనకు నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.
జూలై 7న భౌతికకాయాన్ని ఇరాన్లోని ప్రముఖ మతపరమైన కేంద్రం కోమ్ నగరానికి తరలించనున్నారు. ఆ మరుసటి రోజు షియా ముస్లింల పవిత్ర నగరాలైన ఇరాక్లోని నజాఫ్, కర్బలాలకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. జూలై 9న ఖమేనీ సొంత పట్టణమైన మషహద్లోని ప్రసిద్ధ ఇమామ్ రెజా దర్గా దగ్గర భారీ ఎత్తున అంతిమ సంస్కారాలు నిర్వహించి ఖననం చేస్తారు. ఆదివారం జరిగిన కార్యక్రమాలలో ఖమేనీ ముగ్గురు కుమారులు కనిపించినా ప్రస్తుతం సుప్రీం లీడర్గా వ్యవహరిస్తున్న మరో కొడుకు అయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ మాత్రం కనిపించలేదు.
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మొజ్తాబా(Mojtaba) తీవ్రంగా గాయపడ్డారనీ వార్తలు వచ్చాయి. గాయాల కారణంగా అజ్ఞాతంలో ఉంటూనే ఇరాన్ దేశ పాలనా వ్యవహారాలను నడిపిస్తున్నారు. ఆయన సురక్షితంగా ఉన్నారని పేర్కొంటూ ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఆయన మతపరమైన బోధనలు చేస్తున్న ఒక వీడియోను కూడా విడుదల చేసింది.
తన తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా భద్రతా కారణాలు, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన హాజరుకాలేదు. ప్రస్తుతం ఆయన కేవలం ఇరాన్ అధికారిక మీడియా ద్వారా లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తూ దేశాన్ని నడిపిస్తున్నారు. అయితే తండ్రి అంత్యక్రియలకు కూడా మొజ్తాబా హాజరుకాకపోవడంతో అమెరికా, ఇజ్రాయెల్ ఆయన చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నాయి. అంత్యక్రియల ప్రార్థనల్లో మొజ్తాబా సోదరులు ముగ్గురు ముస్తఫా, మెయ్సామ్, మసూద్ మాత్రమే కనిపించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Nandi : శివసన్నిధిలో నంది రహస్యాలు..5 రూపాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు
