Vietnam
వియత్నాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతి చెందిన వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాద సమయంలో పడవలో 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 18 మందిని రక్షించగా, మిగిలిన 18 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్కు చెందిన ఓ మొబైల్ కంపెనీ తమ డీలర్లకు వియాత్నాం(Vietnam) టూరిస్ట్ ట్రిప్ ఏర్పాటు చేసింది. మొత్తం 250 మంది ఇక్కడ నుంచి వెళ్లారు. వీరితో ఏపీ, తెలంగాణకు సంబంధించిన డీలర్లు 40 మంది ఉన్నారు.
ట్రిప్లో భాగంగా మూడు పడవల్లో విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్ ద్వీపంలోని హోన్ మే రట్ ద్వీపం నుంచి అన్ తోయ్ పోర్టుకు తిరిగి వస్తుండగా తీరానికి 400 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సముద్రంలో బలమైన గాలులు వీచడం, అలల ఉధృతి ఎక్కువగా ఉండటమే పడవ బోల్తా పడటానికి కారణమని స్థానిక అధికారులు తెలిపారు.
పడవ తలకిందులు కావడంతో పర్యాటకులు లోపలే చిక్కుకుపోయారు. సమీపంలోని ఇతర పర్యాటక బోట్లు, వియత్నాం కోస్ట్ గార్డ్, సైనిక బృందాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. పడవ బోల్తా పడిన ఐదు నిమిషాల్లోనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నా.. చాలా మంది పర్యాటకులు బోల్తా పడిన పడవ లోపలే చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి.
కొంతమందిని మాత్రమే స్పృహతో ఉన్న స్థితిలో బయటకు తీయగలిగారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందని అక్కడి సిబ్బంది తెలిపారు. భద్రతా సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనపై వియత్నాం(Vietnam)లోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి హనోయి, హో చి మిన్ సిటీలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై వియత్నాం ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మృతదేహాలను స్వదేశానికి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు కింద పేర్కొన్న నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414.
