Bird Flu
ఏపీలోని రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ(Bird Flu) కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా సదుం మండలంలో వేలాది కోళ్లు హఠాత్తుగా మృత్యువాత పడటంతో స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. కేవలం సదుం మండలంలోనే 20 వేలకు పైగా కోళ్లు చనిపోవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నట్లు తెలుస్తోంది. వ్యాధి మరింత విస్తరించకుండా అధికారులు మిగిలిన కోళ్లను చంపించి (Culling), వాటిని సామూహికంగా ఖననం చేస్తున్నారు.
కోళ్లలో ఎక్కువగా కనిపించే ఈ బర్డ్ ఫ్లూ (పక్షుల ఇన్ ఫ్లుయెంజా) అనేది ఒక రకమైన వైరల్ ఇన్ ఫెక్షన్. ఇది ముఖ్యంగా ‘H5N1’ అనే వైరస్ ద్వారా పక్షులకు సోకుతుంది. సాధారణంగా శీతాకాలం చివరలో కానీ వసంతకాలం మొదట్లో, అంటే వాతావరణం మారే సమయంలో కానీ ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వలస పక్షుల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బర్డ్ ఫ్లూ వైరస్ చేరుతుంది. ఒకసారి పౌల్ట్రీ ఫాంలలోకి కనుక ఈ వైరస్ ప్రవేశిస్తే, కోళ్లకి చాలా వేగంగా వ్యాపిస్తుంది. కోళ్లకు మాత్రమే కాదు..బాతులు, టర్కీలు వంటి ఇతర పక్షులకు కూడా ఇది సోకుతుంది.
చాలా మంది చికెన్ ధరలు పెరిగినప్పుడల్లా ఎవరో కావాలని పుట్టిస్తున్న రూమర్ అని అనుకుంటారు. కానీ బర్డ్ ఫ్లూ(Bird Flu) అనేది ఒక శాస్త్రీయంగా నిరూపించబడిన వైరల్ వ్యాధి అని గుర్తించబడింది. అయితే, ప్రతి కోడి మరణం కూడా బర్డ్ ఫ్లూ మరణం కాదు. కొన్నిసార్లు వేడి వల్ల ,ఇతర ఇన్ ఫెక్షన్ల వల్ల కూడా కోళ్లు చనిపోవచ్చు. కానీ ఇప్పుడు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో శాంపిల్స్ ని భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపించడంతో.. ఇది బర్డ్ ఫ్లూ అని ప్రాథమికంగా నిర్ధారించడంతో.. దీనిని రూమర్ అని నిర్లక్ష్యం చేయకూడదు.
వెటర్నరీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కువ టెంపరేచర్ వద్ద చనిపోతుంది. మనం సాధారణంగా చికెన్ వండేటప్పుడు 70°C నుంచి 100°C పైనే ఉడికిస్తాం కాబట్టి ఆ వేడికి వైరస్ నశిస్తుంది. కాబట్టి చికెన్ ని బాగా ఉడికించి తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, పచ్చి మాంసాన్ని శుభ్రం చేసేటప్పుడు మాత్రం చేతులకు గ్లౌజులు వేసుకోవడం,తర్వాత శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యం. ప్రస్తుతం ఏపీలో ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో కోళ్ల రవాణాపై నిషేధాన్ని విధించారు. పౌల్ట్రీ కార్మికులు ఎక్కువగా బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి.
ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. సదుం, అమ్మగారి పల్లి గ్రామాలతో పాటు చుట్టు పక్కల గ్రామాలలో శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.కాబట్టి బర్డ్ ఫ్లూ పై భయం వద్దు కానీ జాగ్రత్త అవసరం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. చికెన్ ప్రియులు చికెన్ను బాగా ఉడికేలా (Well-cooked) చూసుకోవడం ద్వారా ఈ ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చు.
