Guns
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపైన ప్రశ్నలు రేకెత్తించేలా..శనివారం ఉదయం కోఠి ప్రాంతంలో సంచలన దోపిడీ చోటుచేసుకుంది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎమ్ కేంద్రంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఒక వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి, రూ. 6 లక్షలతో పాటు అతని బైక్ను కూడా అపహరించుకుపోయారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో, పగటిపూట అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన నగరాన్ని ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది.
నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారి రిన్షద్, శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో రూ. 6 లక్షల నగదును డిపాజిట్ చేయడానికి కోఠిలోని ఎస్బీఐ ఏటీఎమ్ వద్దకు వెళ్లాడు. అయితే, అప్పటికే అతనిని ఫాలో అవుతున్న ఇద్దరు దుండగులు బ్లాక్ కలర్ యాక్టివా (TS08HN 8582)పై వచ్చి.. రిన్షద్ ఏటీఎమ్ లోపలికి వెళ్లబోతుండగా, దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో రిన్షద్ కాలికి బులెట్ గాయం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే దుండగులు ఆ డబ్బుల బ్యాగును, రిన్షద్ బైక్ను తీసుకుని పరారయ్యారు. ప్రస్తుతం బాధితుడు మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రిలో టీట్మెంట్ తీసుకుంటున్నాడు..
గడిచిన ఏడేళ్లలో పెరుగుతున్న పగటి దోపిడీల ధోరణి..హైదరాబాద్లో పగటిపూట జరిగే నేరాల గ్రాఫ్ గడిచిన ఏడేళ్లలో ఆందోళనకరంగా పెరిగింది. 2019-2021 కాలంలో కేవలం రెండు ప్రధాన ఘటనలు జరగ్గా, 2024 నుంచి 2026 నాటికి ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగాయి.
గతంలో జరిగిన ఘటనలను గమనిస్తే.. 2021 జూన్ 20న అల్వాల్లో ఏకంగా ఒక బ్యాంక్ మేనేజర్ను రివాల్వర్తో బెదిరించి రూ. 12 లక్షలు దోచుకెళ్లారు. ఆ తర్వాత 2022 నవంబర్లో అయితే హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్లోనే.. ఒక ఉద్యోగిపై కత్తితో దాడి చేసి రూ. 2 లక్షల విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
2023 మార్చిలో సికింద్రాబాద్ ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎమ్ వద్ద కాల్పులు జరిపి రూ. 4 లక్షలు లూటీ చేశారు. ఇక గతేడాది, అంటే 2024 ఆగస్టు 15న అమీర్పేటలో రూ. 8 లక్షలు డిపాజిట్ చేయడానికి వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటనను ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు కోఠిలో ఈ కాల్పుల కలకలం రేగింది.
అయితే వీరు వాడే ఆయుధాలు ఎక్కువగా కంట్రీ మేడ్ పిస్టల్స్ లేదా రెవాల్వర్స్ కావడం గమనార్హం. అసలు వీటిని అంత ఈజీగా వీళ్లు ఎలా పట్టుకుని తిరుగుతున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక ఎవరుంటున్నారన్న దానిపైన ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కోఠి కాల్పుల ఘటనతో అసలు నగరంలోకి తుపాకులు(Guns) ఎలా వస్తున్నాయనే అంశంపై సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ (MP), ఉత్తరప్రదేశ్ (UP), మహారాష్ట్రల నుంచి ఈ కంట్రీ మేడ్ పిస్టల్స్, రివాల్వర్లు హైదరాబాద్కు చేరుతున్నాయి. గతంలో కేవలం నేరగాళ్లకే పరిమితమైన ఈ తుపాకులు, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మధ్యప్రదేశ్ నుంచి వచ్చే 0.7 ఎం.ఎం పిస్టల్స్ ధర రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటుంది. మీరట్ (UP) ఫ్యాక్టరీల నుంచి వచ్చే మేడ్ ఇన్ యూపీ గన్స్ రూ. 80 వేల వరకు పలుకుతున్నాయి. ఇవి ఎక్కువగా హైవేల ద్వారా లారీలు, బైక్లపై నగరానికి చేరుతున్నాయి. అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను వాడుకుని కూడా ఈ అక్రమ విక్రయాలు జరగడమే ఆందోళన కలిగిస్తోంది.
జనవరి 2026లో హుస్సైనియాలంలో అమ్జద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి.. మధ్యప్రదేశ్ నుంచి తెచ్చిన పిస్టల్ను సీజ్ చేశారు. 2025లో సోషల్ మీడియా గన్ బజార్ను బస్ట్ చేసి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
2025 ఒక్క ఏడాదిలోనే పోలీసులు 50కి పైగా అక్రమ తుపాకుల(Guns)ను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్, టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం సోషల్ మీడియాను మానిటర్ చేస్తున్నా.. వీటి విక్రయాలను పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు.
పోలీసులు ఒకవైపు అరెస్టులు చేస్తున్నా, ఇతర రాష్ట్రాల నుంచి సప్లై చైన్ కట్ కాకపోవడం మెయిన్ ఛాలెంజ్గా మారింది. ఇప్పుడు కోఠి దోపిడీలో వాడిన గన్(GUns) కూడా మధ్యప్రదేశ్ నుంచే వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
