Heavy rain
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎల్లుండి (ఆదివారం) తీరం దాటే అవకాశం ఉంది.దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఏపీకి భారీ వర్ష(Heavy rain) సూచన జారీ చేశాయి.నేడు, రేపు (శుక్ర, శనివారాలు) పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీవ్ర ప్రభావం ఉన్న జిల్లాలు (నేడు).. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు.
మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy rain).. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
దీంతో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA) ప్రజలకు ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.సోమవారం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండొద్దని సూచించింది.
మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈరోజు, రేపు (శుక్ర, శనివారాలు) రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల (నేడు).. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు.
ఎల్లో అలెర్ట్ జిల్లాల (నేడు).. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షం. మొత్తంగా రాగల నాలుగు రోజులు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమాచారం మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసిన హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించబడింది.