Modi: మోదీతో చంద్రబాబు,పవన్ కళ్యాణ్.. 3 లక్షల మందితో బహిరంగ సభ, భారీ ఏర్పాట్లు

Modi: ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న ప్రధాన ప్రాజెక్టుల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అంశాలు ఉన్నాయి.

Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) రేపు (అక్టోబర్ 16, 2025) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు, కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం ఈ పర్యటన కోసం శ్రీశైలం , కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటనలో సుమారు రూ. 13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.

ప్రధాని మోదీ(Modi) శంకుస్థాపన చేయనున్న ప్రధాన ప్రాజెక్టుల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అంశాలు ఉన్నాయి. రూ.2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలులోని మూడు పూలింగ్ స్టేషన్లను అనుసంధానం చేసే ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు.రూ.4,920 కోట్లతో ఓర్వకల్ మరియు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఈ రెండు కారిడార్ల అభివృద్ధిని కేంద్రంలోని జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ మరియు ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు సంయుక్తంగా చేపడతాయి. ఈ కారిడార్ల ద్వారా సుమారు రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, లక్ష మందికి ఉద్యోగ కల్పన చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తుంది.

Modi

పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనకు, ఎస్ గుండ్లపల్లి–కనిగిరి బైపాస్‌కు కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే, రూ.960 కోట్లతో అభివృద్ధి చేస్తున్న సబ్బవరం–శీలానగర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి, రూ.1,000 కోట్లతో చేపడుతున్న పీలేరు–కాలూరు మధ్య నాలుగు లేన్ల రహదారి విస్తరణకు, రైల్వే ఓవర్ బ్రిడ్జికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

ఇప్పటికే రూ. 1,200 కోట్లతో చేపట్టిన కొత్త వలస–విజయనగరం నాలుగో లేన్‌ను, అలాగే పెందుర్తి సింహాచలం వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిని ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతోపాటు, కొత్తవలస-బొద్దవార సిమిలిగూడ గోరాపూర్ సెక్షన్లలోని గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేస్తారు.

ప్రధాని మోదీ రేపు ఉదయం 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి, ఉదయం 10 గంటల 20 నిమిషాలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకు కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

‘సూపర్ జీఎస్టీ సూపర్ హిట్’ పేరుతో జరిగే ఈ బహిరంగ సభకు ప్రధాని మోదీ(Modi)తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా కూటమి నాయకులు హాజరుకానున్నారు. ఈ సభకు సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ఏర్పాటు చేసి, సౌకర్యవంతంగా కూర్చోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Diwali :దీపావళికి ఢిల్లీలో 4 రోజులు గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతి

Exit mobile version