BCCI
టీ20 ప్రపంచకప్ లో బిజీగా ఉన్న టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ(BCCI ) షాకిచ్చింది. తమ కుటుంబసభ్యులను కూడా తమతో పాటు అనుమతించాలంటూ వారు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. గతంలో ఉన్న నిబంధనలను తొలగించేందుకు బోర్డు అంగీకరించలేదు. ఈ మేరకు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన రిక్వెస్టును ఒప్పుకోలేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని బోర్డు తేల్చి చెప్పింది. దీంతో ఫ్యామిలీలతో కలిసి ఉండాలనుకున్న భారత ఆటగాళ్లకు నిరాశే మిగిలింది.
గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత బీసీసీఐ(BCCI ) కఠినమైన రూల్స్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా విదేశీ పర్యటనలు, ఐసీసీ టోర్నీల సమయంలో ఆటగాళ్లతో పాటు కుటుంబసభ్యులు ఉండడంపై ఆంక్షలు విధించింది. 45 రోజుల కంటే ఎక్కువ సమయంలో జరిగే సిరీస్ లు లేదా టోర్నీలకు రెండు వారాల పాటు కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు అనుమతి ఇచ్చింది. అది కూడా ఆటగాళ్లు తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ కు అయ్యే ఖర్చంతా వారే భరించాల్సి ఉంటుంది. అలాగే టీమ్ తో పాటు ఒకే బస్సులో ప్రయాణించేందుకు అనుమతి లేదు.
ఏ ఒక్క ప్లేయర్ లేదా కోచ్ కూడా సొంత వాహనాల్లో వెళ్లకూడదు. కచ్చితంగా టీమ్ బస్సులోనే ప్రయాణించేలా కఠినమైన నిబంధనలు తెచ్చింది. అలాగే ఆటగాళ్ల వ్యక్తిగత సిబ్బంది అంటే మేనేజర్లు, ఏజెంట్లు, పర్సనల్ చెఫ్స్ లకు టీమ్ బస చేసే హోటల్లోకి అనుమతి లేదు. అప్పటి నుంచీ ప్రతీ సిరీస్ కు ఈ రూల్స్ కచ్చితంగా అమలు చేస్తూ వస్తోంది.
అయితే ప్రస్తుతం ప్రపంచకప్ స్వదేశంలోనే జరుగుతుండడంతో కుటుంబసభ్యులను అనుమతించాలని కోరుతూ హెడ్ కోచ్ గంభీర్ , కెప్టెన్ సూర్యకుమార్ బీసీసీఐకి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించిన బీసీసీఐ(BCCI ) వారికి విజ్ఞప్తిని తోసి పుచ్చింది. గత రూల్స్ లో మార్పులు చేసేందుకు అంగీకరించలేదు. పైగా ఐసీసీ ప్రపంచకప్ కావడంతో జట్టు ఆటపై ఎలాంటి ప్రభావం ఉండకుండా చూడాలన్న నిర్ణయానికే బోర్డు కట్టుబడి ఉన్నట్టు ఒక అధికారి చెప్పారు.
గంభీర్ వ్యక్తిగతంగా దీనిపై బోర్డుకు విజ్ఞప్తి చేసినా బీసీసీఐ పెద్దలు మాత్రం ఈ నిబంధనను సడలించేందుకు ఒప్పుకోలేదు. ఇలా సిరీస్ కు ఒక్కో రూల్ అనుసరించడం సరికాదని గంభీర్ కు స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆటపైనా దృష్టి పెట్టాలని, కుటుంబసభ్యులను అనుమతించడం కుదరదని సూర్యకుమార్ కు సైతం బోర్డు స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ తొలి మ్యాచ్ లో అమెరికాపై గెలిచి ఇప్పుడు గురువారం నమీబియాతో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.
