Hyderabad Metro:హైదరాబాద్ మెట్రోలో సర్కారీ పాలన.. ఇకపై పూర్తి ప్రైవేటు రహితంగా మెట్రో

Hyderabad Metro: నష్టాల వల్ల మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవాలని ఎల్ అండ్ టీ భావిస్తున్న సమయంలో..ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బాధ్యతలను తన భుజాన వేసుకుంటుంది.

Hyderabad Metro

భాగ్యనగర రవాణా వ్యవస్థలో గుండెకాయ వంటి హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)పై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో ఎల్ అండ్ టీ కంపెనీ నిర్వహణలో ఉన్న మెట్రోను.. ఇకపై పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోబోతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. నష్టాల వల్ల మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవాలని ఎల్ అండ్ టీ భావిస్తున్న సమయంలో..ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బాధ్యతలను తన భుజాన వేసుకుంటుంది. జూన్ నాటికి ఈ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది.

ఈ స్వాధీన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడానికి .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక శక్తివంతమైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలు సభ్యులుగా ఉంటూ, లీగల్ అంశాలను పర్యవేక్షించబోతున్నారు.

కుదిరిన ఒప్పందం ప్రకారం, ఎల్ అండ్ టీ సంస్థకు రేవంత్ సర్కార్ సుమారు 2 వేల కోట్ల రూపాయల ఈక్విటీని ఏకమొత్తంగా చెల్లించబోతోంది. అలాగే మెట్రో(Metro)కు ఉన్న సుమారు 13 వేల కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం తన అకౌంట్లోకి ట్రాన్సఫర్ చేసుకునేలా ప్రాథమిక అవగాహన కుదిరింది. మెట్రో రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి ఆస్తుల విలువను ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మదింపు చేసి తెలంగాణ ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించింది.

Hyderabad Metro

మెట్రో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ పరం కానుండటంతో, రెండో దశ విస్తరణపై రేవంత్ సర్కారు మరింత దూకుడు పెంచబోతోంది. సుమార 19,579 కోట్ల రూపాయల అంచనాతో 86.1 కి.మీటర్ల వరకూ మెట్రోను పొడిగించడానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఎల్ అండ్ టీ తప్పుకోవడం వల్ల మెట్రో విస్తరణ ఆగిపోతుందని అనుకున్న వారికి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రంగంలోకి దిగడం పెద్ద ఊరటనిస్తోంది. మెట్రోను పూర్తిగా ప్రైవేటు నుంచి తీసుకుని.. ప్రభుత్వ సంస్థగా మార్చడం వల్ల భవిష్యత్తులో టికెట్ ధరలు వంటివి నియంత్రణ చేయడంతో పాటు, మెరుగైన సౌకర్యాలు , సామాన్యులకు రవాణా మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.

అయితే దీనిపై ఇప్పుడు అలాగే ముందు ముందు లీగల్ పరంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ కన్సల్టెన్సీల సలహాలను తీసుకుంటోంది. మొత్తానికి హైదరాబాద్ మెట్రో ఇకపై పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మారి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version