Karnataka
స్టూడెంట్స్ నవ్వులతో, వారి భవిష్యత్తు ఆశయాలతో కళకళలాడాల్సిన కాలేజీ ప్రాంగణాలు ఇప్పుడు ఊహించని నిశ్శబ్ద శోకంలో మునిగిపోతున్నాయి. దేశ ప్రగతిని మార్చాల్సిన ఈ తరం యువత.. భయానక మహమ్మారి కోరల్లో చిక్కుకుని తమ అమూల్యమైన జీవితాలను బలిపీఠంపై పెడుతోంది.
కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో వేలాది మంది స్టూడెంట్స్ హెచ్ఐవీ బారిన పడుతున్నారనే దిగ్భ్రాంతికరమైన వార్త.. ఇప్పుడు విద్యా, వైద్య రంగాలను మాత్రమే కాదు యావత్ దేశాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న హెచ్ఐవీ కేసుల్లో ఎక్కువ శాతం 18 నుంచి 25 ఏళ్ల వయస్సున్న కాలేజీ స్టూడెంట్స్ ఉంటున్నట్లు అధికారిక లెక్కలు తేల్చాయి.
ఈ సంచలన లెక్కలు వెలువడటంతో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేట్ కాలేజీల్లో హెచ్ఐవీ పరీక్షలతో పాటు అవగాహన కౌన్సెలింగ్ కేంద్రాలను విధిగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారిక డేటా ప్రకారం, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల యూత్లోనే ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది. ఈ బాధితుల సంఖ్య 2023-24లో 44,500గా ఉండగా, అది కాస్తా ఇప్పుడు భారీగా పెరిగింది.
ముఖ్యంగా తాజాగా నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల సుమారు 7,000 మందికి పైగా స్టూడెంట్స్లో హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికే కాలేజీ స్థాయిలో విస్తృతమైన అవగాహన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
కాలేజీలలో నిర్వహించే ఈ మెడికల్ టెస్ట్లు పూర్తిగా స్టూడెంట్స్ అనుమతితోనే జరుగుతాయని, ఎవరిపైనా బలవంతంగా నిర్వహించబోమని అధికారిక యంత్రాంగం స్పష్టం చేసింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) నివేదికల ప్రకారం, దేశంలోనే ఎక్కువ హెచ్ఐవీ బాధితులు ఉన్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో దాదాపు 2.60 లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తుండగా, సుమారు 54 వేల మందికి తమకు హెచ్ఐవీ సోకిన విషయమే తెలియకపోవడం మరింత ప్రమాదకరమైన అంశంగా మారింది. దీంతో విద్యార్థులకు వ్యాధిపై సరైన అవగాహన కల్పించడానికి, అవసరమైన మెడికల్ హెల్ప్ వివరాలు అందించడానికి కాలేజీలలో స్పెషల్గా క్యూఆర్ కోడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
Srisailam : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు.. శ్రీశైలానికి క్యూ కట్టిన వరద నీరు
