Anti-Paper Leak Bill
దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రశ్నాపత్రాల లీకేజీల ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఎంతో కాలంగా వివాదాస్పదంగా మారి, స్టూడెంట్స్ తీవ్ర నిరసనలకు దారితీసిన యాంటీ పేపర్ లీక్ బిల్లు(Anti-Paper Leak Bill)కు లోక్సభ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
ఈరోజు సభలో విపక్షాల ఆందోళనలు, వాకౌట్ల నడుమ మూజువాణి ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లు(Anti-Paper Leak Bill) పాస్ అయింది. పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచడంతో పాటు స్టూడెంట్స్కు న్యాయం చేయడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశమని మోదీ ప్రభుత్వం తెలిపింది.
కొత్తగా ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడినా, ప్రశ్నాపత్రాల అవకతవకలకు పాల్పడినా శిక్షలు అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. గతంలో ఉన్న చట్టాలతో పోలిస్తే ఇప్పుడు శిక్షల తీవ్రతను గణనీయంగా పెంచారు.
పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులకు ఏకంగా 10 ఏళ్లు వరకు జైలు శిక్ష పడుతుంది. ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ లేదా ముఠాలకు విధించే గరిష్ట జరిమానాను రూ. 10 కోట్ల వరకు పెంచారు. ఏవైనా పేపర్ లీకేజ్ కేసులు నమోదైతే దర్యాప్తును కేవలం 2 నెలల్లోనే పూర్తి చేసేలా టైమ్ లిమిట్ను విధిస్తున్నారు. అంతేకాకుండా, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చూడటానికి కేసులను 3 నెలలలో పరిష్కరించేలా ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నారు.
అయితే సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతుండగా తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పేపర్ లీక్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టూడెంట్స్పై నిరసనల వేళ హోంమంత్రి అమిత్ షా వివాదాస్పద కామెంట్లు చేశారంటూ ఆరోపించగా.. ఈ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దీనిపై స్పందించి.. తగిన సాక్ష్యాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడకూడదని, వెంటనే రాహుల్ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తర్వాత విపక్ష సభ్యులు నిరసన తెలుపుతూ వాకౌట్ చేయగా, ప్రభుత్వం మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపింది.
అయితే ఈ బిల్లు ద్వారా నేరస్థులు ఇకపై తప్పు చేయాలంటే భయపడతారని, దీంతో అక్రమాలకు స్వస్తి పలికే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇదే సమయంలో కేవలం కఠిన చట్టాలు, పదేళ్ల జైలు శిక్షలు కాగితాలపైన పెట్టినంత మాత్రాన సమస్య పూర్తిగా క్లోజ్ అయినట్లు కాదని నిపుణులు సూచిస్తున్నారు.
పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత శిక్షించడం కంటే, అసలు ప్రశ్నాపత్రాలు లీక్ జరగకుండా ప్రింటింగ్, రవాణా, డిజిటల్ సెక్యూరిటీ , ఎగ్జామ్ సెంటర్ల వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినప్పుడే స్టూడెంట్స్ కష్టానికి నిజమైన ప్రతిఫలం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Telegram Founder : తీవ్ర చిక్కుల్లో టెలిగ్రామ్ ఫౌండర్.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన రష్యా
