CJP
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్ ఉత్కంఠ రేపుతోంది. సమగ్రమైన విద్యా వ్యవస్థ కోసం, విద్యా రంగంలో పారదర్శకత తీసుకురావడానికి , దేశంలో అవినీతి, పరీక్షల అక్రమాలను నిరసిస్తూ సీజేపీ చలో సంసద్ పేరుతో సోమవారం దీనిని నిర్వహిస్తోంది.
నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ సీజేపీ(CJP) మద్దతుతో ఈ మార్చ్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నా కూడా అక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు అభిజీత్ దీప్కే కూడా నిరాహార దీక్షకు దిగారు.
సోమవారం జరగనున్న ఈ మార్చ్కు విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. నీట్, ఇతర ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీల ఘటనలను నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.
దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి పార్లమెంట్ మార్చ్కు పిలుపునిచ్చారు. అయితే సీజేపీ తలపెట్టిన ఈ మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు జరగనున్న మార్చ్ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని , భద్రతా కారణాల దృష్ట్యా దీనికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్లమెంట్, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. ఈ భద్రతను మరింత కఠినతరం చేశారు.
మరోవైపు అనుమతి లేకపోయినా శాంతియుతంగా మార్చ్ను విజయవంతం చేయాలని సోనమ్ వాంగ్చుక్ తన మద్దతుదారులను కోరారు. ఇదిలా ఉంటే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా నిరాహారదీక్షకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. వాంగ్ చుక్ను పోలీసులు అక్రమంగా ఆసుపత్రికి తరలించారని ఆయన మండిపడుతున్నారు.
వాంగ్చుక్ను నిర్భంధించినా ఈ పార్లమెంట్ మార్చ్ ఆగదని స్పష్టం చేశారు. నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మార్చ్లో పాల్గొనడానికి ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. తాజా పరిణామాలతో సీజేపీ.. ప్రధాని మోదీ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తోంది.
Cracked Heels : పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా?.. సాఫ్ట్ పాదాలను పొందే ఇంటి టిప్స్ ఇవే..
