Shreyas Iyer : శతక్కొట్టిన శ్రేయాస్..పంజాబ్ ఆశలు సజీవం

Shreyas Iyer : వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. లక్నోను చిత్తు చేసి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది

Shreyas Iyer 

ఐపీఎల్ 19వ సీజన్ చివరి ప్లే ఆఫ్ బెర్త్ కోసం పోటీ రసవత్తరంగా మారింది. వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. లక్నోను చిత్తు చేసి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. ఆదివారం రాజస్థాన్ చివరి మ్యాచ్ లో ఓడితే పంజాబ్ ముందంజ వేస్తుంది.

లక్నో సూపర్ జెయింట్స్ పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు లక్నో ఈ మ్యాచ్ లో అవకాశమిచ్చింది. భారీ టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచే లక్ష్యంతో లక్నో కూడా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

కులకర్ణి డకౌటవగా.. నికోలస్ పూరన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో ఓపెనర్ జోస్ ఇంగ్లీస్, ఆయుశ్ బదోనీ అదరగొట్టారు. బదోనీ 43 పరుగులకు ఔటైనా ఇంగ్లీస్ మాత్రం ధాటిగా ఆడాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ (26) పరుగులకు వెనుదిరగ్గా, ముకుల్ చౌదరి(1) కూడా నిరాశపరిచాడు.

అయితే అబ్దుల్ సమద్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అర్జున్ టెండూల్కర్ 5 నాటౌట్ గా నిలవడంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో జెన్సన్ 2, చాహల్ 2 వికెట్లు తీసారు.

తర్వాత ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ రెచ్చిపోయింది. ప్రియాన్ష్ ఆర్య (0), కూపర్ కన్నోలీ(18) నిరాశపరిచారు. అయితే తర్వాత ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వీరవిహారం చేశారు. వీరిద్దరూ కేవలం 76 బంతుల్లోనే 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Shreyas Iyer

ఈ క్రమంలో ప్రభ్ సిమ్రన్ సింగ్ 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులకు ఔటయ్యాడు. అప్పటికే పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమైంది. శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉండడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో శ్రేయాస్ సెంచరీతో చెలరేగిపోయాడు. సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయాస్ కు ఇదే తొలి శతకం. దీంతో పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో 15 పాయింట్లతో పంజాబ్ టాప్ 4లోకి దూసుకొచ్చింది. అయితే రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా తమ చివరి మ్యాచ్ లలో ఓడిపోతే పంజాబ్ ప్లే ఆఫ్స్ కు చేరుతుంది.

MI vs RR : గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్..ముంబైతో రాజస్థాన్ చావోరేవో

Exit mobile version